తాడిపత్రి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ- ఓటుహక్కు కోసం హైకోర్టులో దీపక్రెడ్డి పిటిషన్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఊరటనిచ్చిన ఏకైక విజయం తాడిపత్రి మున్సిపాలిటీ కూడా ఇప్పుడు దూరమయ్యే పరిస్ధితి కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ కంటే సీట్లలో వెనుకబడిన వైసీపీ.. ఎక్స్ అఫీషియో ఓట్ల సాయంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. ముఖ్యంగా ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో ఓట్లకు పరిగణనలోకి తీసుకోకూడదని స్ధానిక ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయం కాకరేపుతోంది.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఓట్లను ఎక్స్ ఆఫీషియో కోటాలో పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ, జేసీ దివాకర్రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో తనకు ఓటు హక్కు కల్పించాలని ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. దీంతో ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాడిపత్రి పోరులో వైసీపీ, టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కన్నేసిన నేపథ్యంలో హైకోర్టు ఇవ్వబోయే ఉత్తర్వులు కీలకంగా మారాయి.
తాడిపత్రి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 36 సీట్లకు గానూ టీడీపీకి 18 సీట్లు, వైసీపీకి 16 సీట్లు వచ్చాయి. రెండు సీట్లు ఇతరులకు దక్కాయి. ఇక్కడ మున్సిపల్ ఛైర్మన్ పీఠం సొంతం చేసుకునేందుకు వైసీపీకి ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలిసొస్తున్నాయి. కానీ ఎమ్మెల్సీలను కూడా అనుమతిస్తే టీడీపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కుతుంది. దీంతో ఎమ్మెల్సీ ఓట్లను స్ధానిక అధికారులను అనుమతించకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.