Amaravati: జగన్ ఆరాధ్య ఆధ్యాత్మిక గురువుకు చేదు అనుభవం: రైతులు అడ్డుకున్న వైనం..!
అమరావతి: విశాఖ శ్రీశారదా పీఠం పీఠాధిపతి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వరూపానందేంద్ర సరస్వతికి అమరావతి ప్రాంత రైతుల నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆరాధ్య ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందిన ఆయన పర్యటనను అమరావతి ప్రాంత రైతులు అడ్డుకున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించేలా వైఎస్ జగన్పై ఒత్తిడికి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు.

గోరంట్ల వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి..
స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ఉదయం గుంటూరు సమీపంలోని గోరంట్ల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చారు. ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి అభిభాషణం చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి.. గోరంట్ల వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చారనే సమాచారం తెలుసుకున్న వెంటనే అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

కారును అడ్డగించిన రైతులు..
తన కార్యక్రమాలను ముగించుకుని విశాఖపట్నానికి బయలుదేరిన స్వరూపానందేంద్ర కారును మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. కారుకు అడ్డుగా నిల్చున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించేలా ముఖ్యమంత్రికి సూచించాలని పట్టుబట్టారు. అమరావతికి జై కొట్టాలనీ డిమాండ్ చేశారు. యజ్ఙ యాగాదులను నిర్వహించి, పరిపాలన మొత్తాన్నీ అమరావతి నుంచే కొనసాగించేలా చేయాలని అన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.

ముఖ్యమంత్రిని ఒప్పించాలంటూ డిమాండ్..
ఆయన వెంటే ఉన్న ఆయన వ్యక్తిగత సిబ్బంది, గోరంట్ల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యులు రైతులను శాంతింపజేయడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. అమరావతిలోనే పరిపాలనను కొనసాగించడంపై హామీ ఇవ్వాలని, జై అమరావతి అంటూ నినదించాలని పట్టుబట్టారు. ఇదివరకు అమరావతి సుభిక్షంగా ఉండాలని, రాజధాని నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగాలని కోరుతూ స్వరూపానందేంద్ర యాగాలను నిర్వహించారని గుర్తు చేశారు.

పోలీసుల జోక్యంతో..
ఇప్పుడూ అలాంటి కార్యక్రమాలనే చేపట్టాలని, ముఖ్యమంత్రిని ఒప్పించాలని డిమాండ్ చేశారు. జై అమరావతి, సేవ్ అమరావతి అంటూ నినదించారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటేనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులను పక్కకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు విలేకరులతో మాట్లాడారు. స్వరూపానందేంద్ర స్వామి చెప్పిన మాటలను వైఎస్ జగన్ వింటారని, అందుకే ఆయనను అడ్డుకోవడం ద్వారా తమ నిరసనను ముఖ్యమంత్రికి తెలిసేలా చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications