అసెంబ్లీ: నెగ్గిన సిఎం తీర్మానం, టి బిల్లు తిరస్కరణ
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఓటింగ్ లేకుండానే చర్చ ముగిసింది. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసును సభాపతి నాదెండ్ల మనోహర్ శాసన సభ ముందు ప్రవేశ పెట్టారు. మూజువాణి ఓటు ద్వారా సభ్యుల అభిప్రాయాలు ఆ నోటీసు పైన తీసుకున్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పారు. సభలో 86 మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. ప్రభుత్వ తీర్మానాన్ని తిరస్కరించడానికి కారణాలు ఏమీ లేవని చెప్పారు. బిల్లుపై 9,076 సవరణలు వచ్చాయన్నారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరించాలన్న పది అనధికర వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. కిరణ్ నోటీసు పైన మాత్రమే మూజవాణి ఓటు ద్వారా అభిప్రాయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు మూజువాణి ఓటు ద్వారా శాసన సభ ఆమోదించింది. దీనిని రాష్ట్రపతికి పంపించనున్నారు. అభిప్రాయం తీసుకున్న అనంతరం సభాపతి శాసన సభను నిరవధికంగా వాయిదా వేశారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన 23 పని దినాల్లో 56 గంటలకు పైగా చర్చ జరిగింది. శాసన సభలో 86 మంది అభిప్రాయాలు చెప్పగా, మిగిలిన వారు రాతపూర్వకంగా ఇచ్చారు. కాంగ్రెసు నుండి 42, టిడిపి నుండి 20, తెరాస నుండి 9, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి 7, సిపిఐ నుండి ఇద్దరు, మజ్లిస్, బిజెపి, సిపిఎం, లోక్సత్తా నుండి ఒక్కరు చొప్పున అభిప్రాయాలు చెప్పారు. మరోవైపు శాసన మండలి కూడా బిల్లును తిరస్కరించింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది.