173 నియోజకవర్గాలు ఒక ఎత్తు... ఆ 2 మరో ఎత్తు..!?
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకైనా, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకైనా, జనసేనకైనా.. ఏ రాజకీయ పార్టీకైనా రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 173 నియోజకవర్గాలు ఒక ఎత్తయితే ఆ రెండు నియోజకవర్గాలు మరో ఎత్తు. కచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలన్నీ తమ చతురంగ బలాలను మొహరించాయి. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ఆ రెండింటిని సాధించడానికి వ్యూహాలు అమలు పరుస్తున్నారు.

రాజధానులు కేంద్రంగా రాబోయే ఎన్నికలు?
తెలుగుదేశం పార్టీ ఒకటే రాజధాని అమరావతి అని చెబుతుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానులంటోంది. రానున్న ఎన్నికలు కూడా ఒక రాజధాని అమరావతి, మూడు రాజధానులు విశాఖపట్నం, కర్నూలు, అమరావతిపై హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను రెండింటిని గెలుచుకొని ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారని చెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం ఉద్యుక్తురాలవుతోంది. ఈ రెండింటిని వైసీపీ పరం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటినుంచే పలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వ్యూహాలు అమలు చేస్తున్నారు.

అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిమీద ప్రజల్లో వ్యతిరేకత భారీగా ఉండటంతో దాన్ని తగ్గించేందుకు అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించారు. కానీ ఈ రెండు గ్రూపుల రాజకీయంతో పార్టీ రోడ్డుమీదకు రావడంతో డొక్కాను జిల్లా అధ్యక్షుడు చేసి కత్తెర సురేష్ కుమార్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటివరకు ఉండవల్లి శ్రీదేవి వర్గం, డొక్కా వర్గం తన్నుకునేవారు. ఇకనుంచి వీరిద్దరితోపాటు కత్తెర సురేష్ వర్గం కూడా కొట్లాటకు సిద్ధమవుతోందంటూ విశ్లేషకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నరు. తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడం.. ఎస్సీలో వైసీపీ బలంగా ఉండటంతో ఇక్కడ గెలవడం సులువని భావిస్తున్నారు.

ఆళ్లను సత్తెనపల్లికి పంపించే అవకాశం?
మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిమీద వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్ టీడీపీ నాయకుడు గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకొని వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. రానున్న ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపించి ఇక్కడ చిరంజీవిని పోటీచేయించాలని జగన్ భావిస్తున్నారు. దీనిపై సర్వేలు నిర్వహింపచేస్తున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీచేస్తున్నారు కాబట్టి చేనేత వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టి మంగళగిరిలో బలంగా ఉన్న చేనేత వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు.

అన్ని గ్రామాలను చుట్టిరావాలంటున్న లోకేష్
మరోవైపు నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అతనికి సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సమయానికి మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను చుట్టి రావాలన్నది నారా లోకేష్ లక్ష్యంగా ఉంది. మొబైల్ వ్యాన్స్ ద్వారా ఆరోగ్య రథాలను నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పంపిస్తుండటంతోపాటు మంగళగిరి బస్టాండ్ వద్ద రోజూ అన్న క్యాంటిన్ నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తిరిగి అక్కడినుంచే గెలుపొందాలనే ధ్యేయంతో లోకేష్ ఉన్నారు. ఈ రెండింటినీ మరోసారి కైవసం చేసుకొని ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారని చాటిచెప్పేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. వీరిద్ధరి అభిప్రాయాల్లో ఎవరి అభిప్రాయాన్ని ప్రజలు గౌరవిస్తారో తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడేంతవరకు ఎదురుచూడక తప్పదు.












Click it and Unblock the Notifications