Tadipatri: తాడిపత్రి టెన్షన్ తట్టుకోలేక రిటర్నింగ్ అధికారి మాయం ?
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆలోపు చాలా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పల్నాడు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది. అయితే ఇదంతా పైకి కనిపిస్తోంది అయితే కనిపించని చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో పలు చోట్ల రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక రిటర్నింగ్ అధికారులు తాము విధుల నుంచి తప్పుకుంటామని ఎన్నికల సంఘానికి విన్నవించుకుంటున్నారు. అయితే ఈసీ వారిని తప్పించే పరిస్ధితి లేదు.
ఇదే క్రమంలో రాయలసీమలో ఇప్పటికే హింస చోటు చేసుకున్న తాడిపత్రి నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాంభూపాల్ రెడ్డి ఇవాళ సెలవుపై వెళ్లిపోయారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎవరికీ అనుకూలంగా వ్యవహరించలేక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన ఎప్పటి నుంచో సెలవు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఈసీ తాజాగా అంగీకారం తెలపడంతో ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే కౌంటింగ్ రోజైన జూన్ 4 కల్లా ఆయన విధుల్లో చేరతారో లేదో తెలియడం లేదు. తాడిపత్రిలో వైసీపీ అభ్యర్దిగా మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తుండగా.. విపక్ష టీడీపీకి చెందిన జేసీ అస్మిత్ రెడ్డి కూటమి అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా ఇక్కడ భారీగా హింస చెలరేగింది. నేతలు సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డిని హౌస్ అరెస్టు చేయడంతో పాటు జేసీ కుటుంబాన్ని ఏకంగా హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు కౌంటింగ్ వేళ మరిన్ని ఘర్షణలు తప్పవన్న అంచనాల నేపథ్యంలో ఆర్వో తప్పుకోవడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications