Rushikonda: ఆ నలుగురిలో ఒకరికి రుషికొండ-సర్కార్ ఛాయిస్ ఎవరో ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో విశాఖలోని రుషికొండ (Rushikonda)ను తొలిచి విలాసవంతమైన భవనాలను నిర్మించారు. వాటిలో సీఎం నివాసం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం మారడంతో వాటిని ఏం చేయాలో తెలియక రెండేళ్లుగా కూటమి సర్కార్ (ap govt) మథన పడుతోంది.దీంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి రుషికొండ భవనాలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రతిపాదనలు స్వీకరిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రఖ్యాత హోటల్ గ్రూపులైన తాజ్ గ్రూప్, అట్మాస్ఫియర్ కోర్, లీలా ప్యాలెస్, ఫెమా గ్రూపులు పోటీ పడుతున్నాయి. వీటిలో ఎవరో ఒకరికి రుషికొండ భవనాలు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ చంద్రబాబు సర్కార్ కు ప్రతిపాదించింది. దీంతో ఇప్పుడు వీరిలో ఎవరికి ఈ భవనాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రుషికొండ ప్యాలెస్ ను భవిష్యత్తులో ప్రజల సందర్శనకు అవకాశం కల్పించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేలా ప్లాన్ చేశారు.

ఈ నేపథ్యంలో తాజ్ గ్రూప్ ఈ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజ్ గ్రూపుతో పాటు మరో ముగ్గురి నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకుని అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నాలుగు సంస్థలు కేబినెట్ సబ్ కమిటీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. వీటిని ప్రభుత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోవడంతో రుషికొండ భవనాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి ప్రభుత్వంపై పెరుగుతోంది.












Click it and Unblock the Notifications