చంద్రబాబు నా పెద్ద కొడుకు, బాధగానే ఉంది: తలసాని తల్లి
హైదరాబాద్: మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో మంగళవారంనాడు పండగ వాతావరణం చోటు చేసుకుంది. తన కుమారుడికి మంత్రి పదవి రావటం సంతోషంగా ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లి లలితాబాయి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో విడిపోయినందుకు బాధగా ఉందని ఆమె మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తనకు పెద్ద కొడుకు లాంటివాడు అయితే తలసాని తనకు చిన్నకొడుకు అని లలితాబాయి అన్నారు. ఇన్నాళ్లు తన బిడ్డ పడ్డ శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కిందని ఆమె అంటున్నారు. కాగా తలసాని శ్రీనివాస్ మంగళవారంనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేచేశారు.. మరోవైపు తలసాని ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన స్పీకర్ మధుసూదనాచారికి అందించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నైతిక విలువలకు, ప్రజాస్వామిక సూత్రాలకు కట్టుబడి తాను రాజీనామా చేసినట్లు ఆయన మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల అభివృద్ధికి తాను పాటుపడుతానని ఆయన చెప్పారు.
ఎవరో చెప్తే నేర్చుకునే స్థితిలో తాను లేనని ఆయన అన్నారు. టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆరుసార్లు తాను అసెంబ్లీకి పోటీ నాలుగు సార్లు గెలిచానని, భవిష్యత్తులో కూడా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఒక్క ఉప ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కోసం ప్రచారానికి వచ్చారని ఆయన అన్నారు.
పాతికేళ్లు టిడిపిలో ఉన్నానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుంటారని, నైతిక విలువల గురించీ ప్రజాస్వామ్యం గురించి వారు చెప్తే నేర్చుకునే స్థితిలో తాను లేనని ఆయన అన్నారు సనత్నగర్ ప్రజల ఆప్యాయత మరిచిపోలేనని ఆయన అన్నారు. తాను ఏమిటనే విషయం అందరికీ తెలుసునని, ఉదారతతో తనను ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పారని, అందుకు ధన్యవాదాలని, ఎన్నికల్లో ఏం జరుగతుందనేది అప్రస్తుతమని ఆయన అన్నారు.
నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పనికి రానివాళ్లు మాట్లాడే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన డ్యూటీ తాను చేస్తానని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. గెలిచిన వెంటనే పార్టీ మారిన చరిత్ర కొంత మందికి ఉందని ఆయన చెప్పారు.