అమాయకులు: బాబుకు జయ లేఖ, ఎన్టీఆర్ వర్సిటీ స్కాంపై సీఎం సీరియస్
గుంటూరు/చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం నాడు లేఖ రాశారు. ఏపీలోని జైళ్లలో ఉంటున్న తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఏపీ జైళ్లలో మొత్తం 516 మంది ఎర్ర చందనం కూలీలు ఉన్నారని పేర్కొన్నారు. జైళ్లలో ఉన్న వారందరూ అమాయకులని, బెయిల్కు అర్హులని లేఖలో పేర్కొన్నారు. కాగా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు తమిళ కూలీలు సహకరిస్తుండటంతో పోలీసులు వారిని అరెస్టు చేస్తున్నారు.
కడప జిల్లా పోరుమామిళ్ల, కాజీపేట తదితర ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి తమిళ కూలీలను ఇటీవల అరెస్టు చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్కాంపై చంద్రబాబు ఆగ్రహం
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో వెలుగు చూసిన కుంభకోణం పైన ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రత్యేక పోలీసు అధికారితో దర్యాఫ్తునకు ఆదేశించాలని మంత్రి కామినేని శ్రీనివాస్ రావును ఆదేశించారు. మెడికల్ సీట్ల కుంభకోణంపై ఆయన ఆగ్రహించారు.
అధికారులతో సమావేశమై కుంభకోణానికి దారి తీసిన పరిస్థితుల పైన చర్చించారు. విద్యార్థులకు నకిలీ సర్టిఫికేట్లు జారీ చేసిన తహసీల్దారు పైన, నకిలీ బిసి సర్టిఫికేట్లు పొందిన ఏడుగురు విద్యార్థుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.