అన్నీ అయిపోయాయి, ఇక ఇది: సీఎంపై రోజా సంచలన వ్యాఖ్య, చంద్రబాబు ఆరా
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకు మహిళా అధికారిణిని బలి చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నిప్పులు చెరిగారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తాంత్రిక పూజలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆలయ ఈవో సూర్య కుమారిని ప్రభుత్వం బదలీ చేసింది.
ఈ అంశంపై రోజా స్పందించారు. కొడుకు నారా లోకేష్ కోసం చంద్రబాబు క్షుద్రపూజలు చేయించి అడ్డంగా దొరికిపోయాడని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ నెపాన్ని అధికారుల పైకి నెట్టడం విడ్డూరమని చెప్పారు. చంద్రబాబు, ఆయన కొడుకు ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న స్వార్థంతో దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేయించారన్నారు.

నేడు సూర్యకుమారి, నిన్న అనురాధ
పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని రోజా వ్యాఖ్యానించారు. గతంలోను ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆ నెపాన్ని మహిళా అధికారి అనురాధ పైకి నెట్టారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పీఠాధిపతులు చంద్రబాబును నిలదీయాలని సూచించారు.
Recommended Video


మనం చూస్తూనే ఉన్నాం
భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి రావొద్దని, ఏ పార్టీ అధికారంలోకి రావొద్దని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని రోజా అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావొద్దని, తామే ఎప్పటికీ పాలించాలని చూస్తున్నారని, ఇందుకోసం ఆయన చేసే ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నామన్నారు.

గట్టిగా మాట్లాడితే కేసులు
ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో వారి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి, తప్పుడు కేసులు పెట్టించి చంద్రబాబు తొక్కేస్తుంటారని రోజా అన్నారు. అలాగే, డబ్బులు ఇచ్చి కొనడం, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి లాక్కోవడం చేస్తున్నారని మండిపడ్డారు.

చివరకు చంద్రబాబు ఇలా
ఇప్పుడు అన్నీ అయిపోయాయని, ఇక ఏమీ కుదరలేదని, అందుకే చివరగా అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసి, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పర్మినెంటుగా అధికారంలో ఉండటానికి ఇలా చేస్తున్నారన్నారు. వారు చేస్తున్న తప్పులు ఇలా ప్రక్షాళన కావాలని చూస్తున్నారన్నారు. దీనిపై ధార్మిక సంస్థలు స్పందించి, చంద్రబాబు చేస్తున్న దానిని ఖండించాలన్నారు.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర
కాగా, వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా జమ్మిలవారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదుగా కలికిరి వరకు సాగుతుంది. ఈ సందర్భంగా చింతపర్తిలో రోజా.. జగన్ నుదుటన తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ అకౌంట్ లో అప్ లోడ్ చేశారు.

సీఎం చంద్రబాబు ఆరా
ఇదిలా ఉండగా, దుర్గ గుడిలో తాంత్రిక పూజలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పూజలపై సీపీ గౌతమ్ సవాంగ్ సీఎంకు వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications