ముందస్తు నిర్ణయాలు - వైసీపీ తొలి ఎమ్మెల్యే అభ్యర్ధి ఖరారు: సిట్టింగ్ ల్లో టెన్షన్..!!
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల ఎంపిక పై అధినేత ఫోకస్ పెట్టారు. క్షేత్ర స్థాయిలో నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న సీఎం జగన్ ప్రతీ అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు. అధికారం నిలబెట్టుకోవాలనే లక్ష్యంగా సీఎం జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపిన సీఎం జగన్.. తాను జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ప్లీనరీ వేదికగా 2024 ఎన్నికలే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.
సర్వేలే ప్రాతిపదికన నిర్ణయాలు
ఇదే సమయంలో పథకాలు క్షేత్ర స్థాయిలు ఏ విధంగా ప్రజల పైన ప్రభావం చూపిస్తున్నాయి...రాజకీయంగా ఎలాంటి అభిప్రాయం ప్రజల్లో ఉందనే అంశం పైన సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల పైన సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో జగన్ పాలన పైన అభిప్రాయం.. ఎమ్మెల్యేల పని తీరు.. సంక్షేమ పథకాల అమలు.. ప్రతిపక్షాల ప్రచారం ఏ రకంగా ప్రజల పైన ప్రభావం చూపిస్తోందనే అంశం పైన ఫోకస్ పెట్టారు. ఇక, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఏడాది పాటు నియోజకవర్గాల పర్యటన ప్రారంభించారు. దసరా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జిల్లాల పర్యటనలకు సిద్దమయ్యారు. టీడీపీ - జనసేన రెండు పార్టీలు సీఎం జగన్ ను ఓడించటం.. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటమే లక్ష్యంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు.
అభ్యర్ధుల విషయంలో ఆచి తూచి
పవన్ ఈ విషయాన్ని స్వయంగా తేల్చి చెప్పారు. ఇక, ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని.. కలిసే పోటీ చేస్తాయంటూ వైసీపీ పదే పదే చెబుతోంది. ఇక, వచ్చే ఎన్నికల్లో దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లుగా తాజా సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. దీంతో..ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఇప్పటికే స్పష్టమైన అల్టిమేటం జారీ చేసారు. పని తీరు మెరుగుపర్చుకొని .. ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేకపోతే..సీట్లు ఇవ్వనని తేల్చి చెప్పారు. వారికి సరి చేసుకోవటానికి సమయం నిర్దేశించారు. ఇక, టిక్కెట్ల కేటాయింపు పైన ఒక్కొక్కటిగా క్లియర్ చేసే కార్యచరణ ప్రారంభించినట్లు గా తెలుస్తోంది. ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మధ్య విభేదాలు.. ఆధిప్యత పోరు సాగుతోందో..అక్కడ ముందుగా అభ్యర్ధులను ఖరారు చేసి.. వారికి లైన్ క్లియర్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
వివాదాలున్న చోట ముందుగానే క్లారిటీ
అందులో భాగంగా టీడీపీ నుంచి గెలిచి వైసీపీ కి దగ్గరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఖాయం చేసినట్లు సమాచారం. కొంత కాలంగా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వంశీ వైసీపీకి దగ్గరైన సమయంలోనే నియోజకవర్గంలో పని చేసుకోవాలంటూ వైసీపీ అధినాయకత్వం సూచించింది. ఇక, ఇప్పుడు అక్కడ రామచంద్ర రావు.. వెంకట్రావు వర్గాలు వంశీకి వ్యతిరేకంగా ఉన్నాయి. వంశీకి టిక్కెట్ ఇస్తే తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. కానీ, తొలి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను బుజ్జగిస్తూనే.. వంశీకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే పనిని జిల్లా పార్టీ సమన్వయ కర్తకు అప్పగించారు.
గన్నవరం వంశీకే కేటాయిస్తారా
వచ్చే ఎన్నికల్లో వంశీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని డిసైడ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో సీనియర్లుగా ఉన్న ఇద్దరికి సైతం గుర్తింపు ఇచ్చేలా నిర్ణయం పైన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..2024 ఎన్నికలకు వైసీపీ నుంచి ప్రకటించే తొలి అఅభ్యర్ధి వంశీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా.. వివాదాలు సాగుతున్న ఇతర నియోజకవర్గాల్లోనూ అభ్యర్దుల పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల వరకు నాన్చటం ద్వారా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని.. ముందుగానే తేల్చటంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారు. దీంతో..దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ వేగంగా. .వ్యూహాత్మంగా వేస్తున్న ఈ అడుగులతో ఇప్పుడు వైసీసీ సిట్టింగ్ ల్లో ఎవరికి తిరిగి టిక్కెట్ దక్కుతుందో..ఎవరికి దక్కదో అనే టెన్షన్ మొదలైంది.