టార్గెట్ జగన్ ..ప్రభుత్వ వైఫల్యాలపై రంగంలోకి చంద్రబాబు .. ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రజా వ్యతిరేక పాలన అని భావిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు సమర శంఖం పూరించటానికి సిద్ధం అయ్యారు . వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటానికి ఆయన ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు . పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను, ఏపీ వెనుకబడుతున్న తీరును ఆయన ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఒంగోలులో ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర
ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. సుమారు 45 రోజుల పాటు ఇది కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది. ఒంగోలులో ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.వైసీపీ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు చంద్రబాబు.
Recommended Video

టార్గెట్ జగన్ అంటూ చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేసేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి విఘాతం అని, మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ ముందుకు రావటం లేదని ఆయన ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారు. మూడు రాజధానుల ఫార్ములా ఫెయిల్ అయ్యే ఫార్ములాగా ఆయన ప్రజలకు అర్ధమయ్యేలా వివరించనున్నారు .

ప్రజలను చైతన్య పరిచే , పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపే చంద్రబాబు యాత్ర
ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి విధ్వంసకర విధానాలతోనే వైసీపీ పాలన సాగిస్తుందని కూల్చివేతలతోనే పాలన మొదలు పెట్టిందని చెప్పనున్నారు . ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజలను చైతన్య పరిచేందుకే ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తామని చెప్తున్న చంద్రబాబు ఏపీలో అరాచకం పెరిగిందని, దాడులు, తప్పుడు కేసులతో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుందని ఇప్పటికే నిప్పులు చెరుగుతున్నారు. కాకినాడలో ఒక కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర గురించి వివరించారు.

9 నెలల పాలనలో అభివృద్ధి శూన్యంగా ఏపీ ఉందని చెప్పాలని భావిస్తున్న బాబు
.వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ కేసులు పెడతారని ప్రజలు, వ్యాపారులు భయపడుతున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘దిశ' చట్టంలో లోపాలున్నాయన్నారు చంద్రబాబు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలనే టీడీపీ వ్యూహం
మీడియాపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక అన్నిటి ఛార్జీలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తే పోలీసు అధికారుల సంఘం స్పందించదా? అని ప్రశ్నించారు. 200 మంది పోలీసు అధికారులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు .ఇక ఈ అంశాలన్నింటినీ ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని భావించి తానే స్వయంగా రంగంలోకి దిగనున్నారు చంద్రబాబు .












Click it and Unblock the Notifications