ఫలించిన కేశినేని శ్రమ: బెజవాడ ఎంపీ సీట్లో టాటా గ్రూప్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 264 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలను టాటా ట్రస్టు రూపొందించింది.
ఈ నెల 23న సాయంత్రం విజయవాడకు టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా రానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో విజయవాడ అభివృద్ధికి సంబంధించి రతన్ టాటా సమావేశమవుతారు.
ఈ నెల 24న గ్రామాల అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా ఆవిష్కరిస్తారు. దేశంలోనే తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టాటా ట్రస్టు దత్తత తీసుకుంది.
దేశంలో పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్న టాటా గ్రూప్ విజయవాడపై ప్రత్యేక దృష్టి సారించడంతో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయని భావిస్తున్నారు.