Power Tariff: విద్యుత్ ఛార్జీల పెంపు.. విమర్శనాస్త్రాలు: జనం ఏడుపు.. జగన్కు సంతోషాన్నిస్తుందట..!
అమరావతి: రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇచ్చిన ఆదేశాల పట్ల ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై కత్తులు నూరుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదల వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటు, కియా కార్ల తయారీ కేంద్రం తరలింపు.. వంటి అంశాలతో జగన్ సర్కార్పై దాడి చేస్తోన్న ప్రతిపక్ష పార్టీలకు విద్యుత్ ఛార్జీల పెంపుదల మరో కొత్త అస్త్రంగా మారినట్టయింది.

500 యూనిట్లు దాటితేనే వాత..
రాష్ట్రంలో ప్రతినెలా 500 యూనిట్లకు మించి విద్యుత్ను వినియోగిస్తోన్న వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతూ ఏపీఈఆర్సీ తాజాగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతినెలా 500 యూనిట్లు, అంతకుమించి విద్యుత్ను వినియోగిస్తే.. యూనిట్ ఒక్కింటికి 90 పైసలను పెంచింది ఈఆర్సీ. 500 యూనిట్ల విద్యుత్ను వినియోగించే కుటుంబాలపై ఈ పెంపుదల ప్రభావం చూపదంటూ ఒకవంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ స్థాయిలో విద్యుత్ను వినియోగిస్తున్నాయంటే ఆయా కుటుంబాలు ధనిక వర్గాల కిందికే వస్తాయనే విషయాన్ని పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు.

విమర్శలకు తావిచ్చినట్టే..
తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుదల అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ వేర్వేరుగా జగన్ సర్కార్పై దాడిని తీవ్రతరం చేశాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ త్వరలోనే ఉద్యమాన్ని నిర్వహించడానికి సమాయాత్తమౌతున్నాయి. ఈ అంశంపై జనసేన పార్టీ నాయకులు ఇంకా స్పందించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ :ఒకవంక.. బీజేపీ-జనసేన మరోవంక.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ కార్యాచరణ ప్రణాళికను వెల్లడించనున్నాయి.

జనం ఏడుస్తోంటే.. జగన్ నవ్వుతుంటారు..
ప్రజలను ఏడిపించడం, వారు ఏడుస్తోంటే హాయిగా నవ్వుకోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అలవాటేనని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఈఆర్సీ ఆమోదాన్ని వ్యక్తం చేసిన వెంటనే.. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను ఏడిపించడానికి వైఎస్ జగన్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. షాకులు మీద షాకులు ఇచ్చి, ప్రజలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇదివరకుక ఆర్టీసీ బస్సు ఛార్జీలు, అంతకుముందు పెట్రోలు, డీజిల్పై రాష్ట్ర పన్ను పెంపు, తాజాగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారని అన్నారు.

రివర్స్ గేర్లో దూసుకెళ్తోన్న రాష్ట్రం..
వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని, రివర్స్ గేర్లో దూసుకు పోతోందని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మొన్న ఆర్టీసీచార్జీలు, నిన్న పెట్రో వాతలు నేడు కరెంట్ చార్జీలు పెంచిన ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మధ్య తరగతి వారికి ఈ నిర్ణయం పెనుభారంగా మారుతుందని చెప్పారు. ఖాళీ ఖజానాను నింపడం ఎలాగో తెలియక, రాష్ట్ర ఆర్ధిక స్థితిని ఎలా మెరుగుపరచాలో తెలుసుకోలేక వైఎస్ జగన్ తుగ్లక్ నిర్ణయాలను తీసుకుంటున్నారని, పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications