వైసీపీ, టీడీపీ కంచుకోటల్లో వీరిని ఢీకొట్టేవారే లేరా??
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గాల్లోని ప్రజలకు ప్రభుత్వాలతో సంబంధం ఉండదు. తాము మొదటి నుంచి ఏ పార్టీని ఇష్టపడ్డామో వాటికే మద్దుతు తెలియజేస్తారు. సంవత్సరాలు కావచ్చు.. దశాబ్దాలు కావచ్చు.. కానీ అక్కడ ఒక పార్టీనే గెలుస్తూ వస్తుంటుంది. అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందా? తెలుగుదేశం ఉందా? అనేది వారికి అనవసరం. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా అక్కడ ఓటర్ల మద్దతు మాత్రం వారికి నచ్చిన పార్టీకే ఓటు వేస్తుంటారు.

జగన్ వేవ్ ను తట్టుకున్న టీడీపీ కోటలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలున్నాయి. పార్టీ ఏర్పాటైనప్పటినుంచి ఆయా పార్టీలకే కొమ్ము కాస్తుంటాయి. దీంతో వాటిని కంచుకోటలుగా పిలవడం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడుకానీ, రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లోకానీ ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రభుత్వాలు ప్రభావితం చేయలేకపోయాయి. పార్టీలే ప్రభావితం చేశాయి. 2019లో ఏపీని ఊపేసిన జగన్ గాలిలో కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని కంచుకోటలను కాపాడుకోగలిగింది. కుప్పం, హిందూపురం, విజయవాడ తూర్పు, ఉండి, పాలకొల్లు, రాజమండ్రి సిటీ, రూరల్, అద్దంకి, పర్చూరు, విశాఖ తూర్పు, టెక్కలి, ఇచ్చాపురం స్థానాల్లో తెలుగుదేశం పార్టీని ఓడించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటలు
వైసీపీకి పులివెందుల, కడప, రాయచోటి, జమ్మలమడుగు, బద్వేలు, శ్రీశైలం, డోన్, పాణ్యం, పుంగనూరు, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, చంద్రగిరి, మాచర్ల, గుడివాడ లాంటి కంచుకోటలున్నాయి. 1983లో టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్న కొన్ని కంచుకోటలను జగన్ వేవ్లో కోల్పోయింది. వాటిల్లో తిరిగి పుంజుకుంటున్నామని ఇటీవలి సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు వెల్లడించినట్లు తెలిసింది. అలాంటి వాటిల్లో పొన్నూరు, మైలవరం, దెందులూరు, పెనమలూరుతోపాటు మరికొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్పినట్లు సమాచారం.

విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు
2014 ఎన్నికల్లో ఉన్న పరిస్థితి 2019కి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. దీన్ని విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోయారు. 2004 ఎన్నికలను కూడా తట్టుకొని నిలబడ్డ కొన్ని టీడీపీ నియోజకవర్గాలు 2019 ఎన్నికల్లో మాత్రం బోల్తా పడ్డాయి. రానున్న ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకుంటోంది. మరోవైపు టీడీపీ కూడా వైసీపీకి పట్టున్న నియోజకవర్గాలపై కసరత్తులు చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎవరి కంచుకోటలను ఎవరు బద్ధలు కొడతారో? ఎవరి కంచుకోటలను ఎవరు కాపాడుకుంటారో తెలియాలంటే ఎన్నికలు జరిగి, వాటి ఫలితాలు వచ్చేంతవరకు ఎదురు చూడక తప్పదు మరి.!!












Click it and Unblock the Notifications