పేదోడి నోటి వద్ద కూడు లాక్కొంటున్నారు.. రేషన్ కార్డుల తొలగింపుపై అనిత ధ్వజం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ మహిళా నేత అనిత. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని.. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. సీఎం జగన్ వింత పోకడలు, విచిత్ర నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రేషన్ కార్డుల తొలగింపుపై కూడా అనిత మాట్లాడారు.
నోటి వద్ద కూడు లాక్కొని..
పేదవాడి నోటి వద్ద కూడు లాక్కోవడానికి ప్రభుత్వం వెనుకాడటం లేదని విమర్శించారు. నవంబర్ నాటికి రాష్ట్రంలో కోటి 52 లక్షల వరకు రేషన్ కార్డులు ఉంటే, డిసెంబర్ వచ్చేనాటికి వాటి సంఖ్య కోటి 44 లక్షల 26 వేలకు చేరిందని తెలిపారు. అంటే నెల రోజుల్లో దాదాపు 8 లక్షల రేషన్ కార్డులకు ప్రభుత్వం కోతపెట్టిందని వివరించారు. ఇదీ ఎంతవరకు సమంజనం అని ఆమె ప్రశ్నించారు.
నిత్యావసర వస్తువుల ధరలు..
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఈ సమయంలో రేషన్ కార్డులకు కోతపెట్టడం సమంజసమేనా అని అనిత ప్రశ్నించారు. రేషన్పై సబ్సిడీని 20 శాతానికే పరిమితం చేయడం కూడా తగదన్నారు. రేషన్ షాపుల్లో అందజేసే సరకుల ధరలను అమాంతం పెంచేశారని విమర్శించారు. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
రూ.10 వేల జీతం..
రూ.10 వేల జీతం వచ్చేవారికి కూడా రేషన్ కార్డులు తీసివేయడం ఎంతవరకు సమంజనం అని అనిత ప్రశ్నించారు. వారు ఎలా బతకాలని అడిగారు. 2019 సెప్టెంబర్లో లక్షా 14 వేల కార్డులకు చెందిన సరుకులను వాలంటీర్లే తీసుకున్నారని అనిత ఆరోపించారు. అక్టోబర్లో 84 వేలకుపైగా కార్డులను కూడా తీసుకున్నారని తెలిపారు. రేషన్ సరుకులు పంపిణీ, సంచుల తయారీ పేరుతో ప్రజల సొమ్ము రూ.700 కోట్లను సీఎం జగన్ పక్కదారి పట్టించారని తెలిపారు.
దోచిపెట్టారు..?
భారతీ పాలిమర్స్కు అప్పనంగా దోచిపెట్టారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి.. ఆ శాఖను గుట్కా నమిలినట్లు నమిలేస్తున్నారని అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరలు పెంచడం, రేషన్ కార్డులను తగ్గిస్తున్నారని ఆరోపించారు. దీంతో పేద/ మధ్య తరగతి ప్రజల వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.