సెలవు రోజుల్లో విధ్వంసం .. వైఎస్ జగన్ కొత్త పథకం : టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఫైర్
టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములపై తాజాగా అధికారుల దాడిని టిడిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కట్టింది ఒక్కటి లేకపోయినా, విధ్వంసాలు మాత్రం చేస్తూనే ఉందని ఆయన ఆరోపించారు.
Recommended Video
విశాఖ భూముల వివాదం : నిరూపించు..లేదంటే.. వైసీపీ మంత్రి అవంతికి టీడీపీ ఎమ్మెల్యే సవాల్ !!
రెండేళ్లలో చేసిందేమిటి... కూల్చివేతలు తప్ప : అచ్చెన్నాయుడు
టిడిపి నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నదని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదని కూల్చివేతలకు మాత్రం లెక్క లేకుండా పోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ప్రశ్నించిన వారి ఆస్తులను కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకొని భయోత్పాతం సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
సెలవురోజుల్లో విధ్వంసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం
గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భూములపై అనేక పరిశీలనలు చేశారన్నఅచ్చెన్నాయుడు ఎక్కడ ఏమి దొరక్క చివరకు ఒక చెరువుకు చెందిన రెండు అడుగుల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ ఫెన్సింగ్ తీసేశారని అసహనం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అచ్చెన్న ఆరోపించారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెలవురోజుల్లో విధ్వంసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఉందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
ప్రశ్నిస్తే దాడులా ... తప్పుడు కేసులా ?
ప్రశ్నించిన టిడిపి నేతలపై భూముల కబ్జా ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే విశాఖలో వెలగపూడి రామకృష్ణబాబు, సబ్బం హరి, గీతం విద్యా సంస్థలపై ఆక్రమణల పేరుతో విధ్వంసం సృష్టించి భయాందోళనకు గురి చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ప్రశాంతతను దూరం చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని టిడిపి సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
బీసీ నాయకులంటే వైసీపీ ప్రభుత్వానికి అలుసు : కాల్వ శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ నాయకులు అంటే ఏపీ సర్కార్ కు బాగా అలసి అయిపోయిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు .విశాఖలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూమిపై అధికారులు దాడి చేసి ఫెన్సింగ్ పీకి వేయడంపై మండిపడిన ఆయన ప్రభుత్వం కావాలనే టీడీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతోందని పేర్కొన్నారు. టీడీపీ నేతలను భయాందోళనకు గురి చెయ్యటమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.