జగన్మోహనపురాలు కాదు వైయస్ జగన్మోసపురాలు... ఆ రేకుల షెడ్డులో మీరుంటారా జగన్ , సాయిరెడ్డి : టీడీపీ ఎటాక్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ లో నిన్న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తాము కట్టబోయేది ఇళ్ళు కాదు ఊళ్లు అంటూ జగన్ ప్రకటించారు. అంతేకాదు వైయస్సార్ కాలనీలు , జగనన్న కాలనీలు నిర్మాణం జరగనుంది అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు.
జగన్ కు సొంత నియోజకవర్గంలో షాక్ .. పట్టాల పంపిణీకి బ్రేక్ .. బాధగా ఉందన్న సీఎం
సీఎం జగన్ , మంత్రులు ఒక గంట అయినా వాటిలో ఉండగలరా ? అచ్చెన్నాయుడు
ప్రభుత్వం ఇచ్చిన 28 లక్షల ఇళ్ల పట్టాల ప్రకటన మోసపూరిత ప్రకటన అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు . వాటిలో 70 శాతం నివాసముంటున్న సొంత స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి పట్టా ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు అచ్చెన్నాయుడు. అంతేకాదు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళను ఇవ్వకుండా నిరుపయోగమైన స్థలాలను ఇచ్చి ఏం లాభమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కట్టే ఇళ్ళల్లో సీఎం జగన్ , మంత్రులు ఒక గంట అయినా ఉండగలరా అంటూ అచ్చెన్నాయుడు నిలదీశారు.
జగన్ రెడ్డికి ఊరుకో ప్యాలెస్ కావాలి పేదలకు వైయస్ రేకుల షెడ్ పథకమా ?: అయ్యన్న పాత్రుడు
అవినీతికి మార్గాలు వెతుక్కుని మరీ పథకాలు రూపొందిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు . దమ్ముంటే ఇళ్ల పట్టాల పై సిబిఐ విచారణ జరిపించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్ రెడ్డికి ఊరుకో ప్యాలెస్ కావాలి పేద వారికి మాత్రం వైయస్ రేకుల షెడ్ పథకమా అంటూ ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల వారికి కొండలు, గుట్టలు, స్మశానాలు, చెరువులలో ఇళ్ల స్థలాలు కేటాయించి అవమానిస్తారా అని నిలదీశారు.
అవి వైయస్ జగన్ మోహన పురాలు కావు వైయస్ జగన్ మోసపురాలు .. టీడీపీ నేత కౌంటర్
అంతేకాదు అవి వైయస్ జగన్ మోహన పురాలు కావు వైయస్ జగన్ మోసపురాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ని వైయస్ రేకుల షెడ్ లో నువ్వు ఉంటావా సాయి రెడ్డి అంటూ ప్రశ్నించారు. గత పాలకులు ఇళ్ల పట్టాల పంపిణీ కి అడ్డు పడ్డారు అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు... చెప్పండి వింటున్నాం కదా మీరు ఇచ్చింది చంద్రబాబు గారు నిర్మించిన ఇల్లు అని అందరికీ తెలుసు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ ప్రారంభం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ఏపీ రాజధాని ఎప్పుడు కడతారు ..ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అంతేకాదు అయ్యా ముఖ్యమంత్రి గారు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే అలా అసమతుల్యత కాదు మీ కోసమే దాని అర్థం పెడుతున్నాం అంటూ జనాభా అసమతుల్యతకు కుల అసమతుల్యతకు తేడా తెలియదని జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. అంతేకాదు బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైయస్ జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే సమయంలో ఇల్లు కాదు ఊళ్ళు కడుతున్నాము అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై రివర్స్ కౌంటర్ ఇచ్చారు బుచ్చయ్య చౌదరి. రాష్ట్ర ప్రజలు మరి రాజధాని ఎప్పుడు కడతారు అంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మొత్తానికి ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ అటు వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.