జగన్ పార్టీ అండ: పవన్ కళ్యాణ్పై టీడీపీ భగ్గు, తెరపైకి 'జూ ఎన్టీఆర్'
హైదరాబాద్: గతంలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణలనే వాడుకొని వదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ లెక్కా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ పార్టీ నేత అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీలను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ను టీఆర్ఎస్తో కుమ్మక్కు అయ్యారని ఎలా ప్రశ్నించారని నిలదీశారు. టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తే టీఆర్ఎస్తో కుమ్మక్కు అయినట్లా అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం పార్టీ ఎంపీలను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ పైన ఎదురు దాడి సరికాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి ప్రచారం చేసి మద్దతు పలికారని గుర్తు చేశారు. మనుషులను వాడుకొని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు.
కృష్ణా జిల్లా ఎమ్మార్వో వనజాక్షి పైన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓ మహిళా అధికారిపై దాడి చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలో ఆటవీక పాలన సాగుతోందన్నారు.