రివర్స్ గేర్: బాబు నో అంటే బిజెపి టిక్కెట్, షర్మిల నిలిస్తే..
పలువురు ఇంచార్జులు, నేతలు చంద్రబాబు వద్దకు వెళ్లి కీలకమైన సీట్ల పైన ఒప్పించే ప్రయత్నాలు చేసే పనిలో పడ్డారు. ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. రాజమండ్రిలో మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరికి సీటు ఇవ్వాలంటూ కేడర్ మంగళవారం భారీ ధర్నాకు సిద్ధపడుతున్నారు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని సెంట్రల్ కాకుండా కైకలూరు స్థానాన్ని బిజెపికి కేటాయించాలంటూ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని ఆధ్వర్యంలో అర్బన్ నేతలు హైదరాబాద్ వెళ్లగా సెంట్రల్ సీటును ఆశిస్తున్న బొండా ఉమామహేశ్వరరావు అనుచరులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ, సెంట్రల్ స్థానాలు వామపక్షాలకు కేటాయించడం వల్లనే వల్లభనేని వంశీ కేవలం 12వేల ఓట్లతో ఓటమిపాలయ్యాడని గుర్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానంటూ మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు భీష్మించి కూర్చున్నారు. దీంతో బిజెపి కూడా భయపడుతోంది. ప్రకాశంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సంతనూతలపాడులో తమ్ముళ్లు వీరంగం వేస్తున్నారు. సీటును ఆశించి ఇటీవలే తెదేపాలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ బిజెపితో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నెల్లూరు రూరల్ సీటు బిజెపికి కేటాయించటంపై ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నారు. విశాఖ పార్లమెంట్ సీటు బిజెపికి కేటాయించడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. జగన్ పార్టీ తరపున షర్మిల నిలబడితే బిజెపి తట్టుకోలేదంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో టిడిపి - బిజెపి ఎన్నికల పొత్తు స్నేహ పూర్వకంగా కుదిరినట్టు కనిపించడం లేదంటున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం అభ్యర్థి దొరకని స్థానాలను బిజెపికి కట్టబెట్టారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్రబాబు వద్దనుకున్న నాయకులను అక్కున చేర్చుకుని, పొత్తులో తమకు వచ్చిన సీట్లలో బిజెపి పోటీకి నిలబెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నుంచి పోటీ చేస్తే కష్టమని భావించిన ఎంపిలు, ఎమ్మెల్యేలంతా టిడిపిలో, జగన్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రులుగా పని చేసిన కావూరి సాంబశివ రావు టిడిపిలోకి రానిచ్చేందుకు స్థానిక క్యాడర్ మొగ్గు చూపలేదు. పురంధేశ్వరి కూడా గతంలో టిడిపిలోకి వస్తారనే ప్రచారం సాగింది. ఆమెకు, బాబుకు మధ్య విభేదాలున్నాయి. వీరిలో పురంధేశ్వరి ఇప్పటికే బిజెపిలో చేరగా.. కావూరి సిద్ధమయ్యారు. పురంధేశ్వరి విశాఖ సిట్టింగ్ ఎంపి ఒకవేళ కాంగ్రెస్లో ఉంటే, ఆమె ఇక్కడి నుంచే పోటీ చేయాల్సి వచ్చేది. పార్టీ మారినప్పటికీ ఆమె విశాఖ నుంచే బరిలోకి దిగుతానని చెపుతున్నారు. అయితే, హరిబాబు తప్పుకుంటే ఆమెకు అవకాశం వస్తుంది.
అలా కాకపోయినా విశాఖ లోకసభ నుంచి షర్మిలను ఎదుర్కోడానికి పార్టీలో చేరనున్న కావూరి సాంబశివ రావును బరిలోకి దించాలని బిజెపి నాయకులు భావిస్తున్నారట. మరోవైపు, గోదావరి జిల్లాల్లో నర్సాపురం లోక్సభ, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలను సీట్ల సర్దుబాటులో భాగంగా బిజెపికి కేటాయించడానికి తెలుగుదేశం అంగీకరించింది. నర్సాపురం లోకసభ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించే విషయంలో అభ్యంతరం లేకపోయినప్పటికీ.. రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలోనే పేచీ వస్తోందట.
రాజమండ్రి సిటీని బిజెపికి కేటాయిస్తే ఓడిపోవటం ఖాయమని, కనీసం డిపాజిట్లు కూడా దక్కవని టిడిపి నాయకులు సోమవారం విలేఖర్ల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. టిడిపికి నిజంగానే రాజమండ్రి సిటీ బలమైన స్థానమైతే, 2004, 2009లో ఎందుకు ఓడిపోయిందని బిజెపి నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించటం పట్ల కూడా టిడిపి నాయకులు గుర్రుగా ఉన్నారు.