ఢిల్లీలో మిత్రులు, రాష్ట్రంలో శత్రువులు: వ్యూహాత్మకమేనా?
అమరావతి: అటు రాష్ట్రంలో, ఇటు దేశంలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న టీడీపీ-బీజేపీలు ఢిల్లీలో మిత్రులుగా, రాష్ట్రంలో శత్రువులుగా కొనసాగనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలోని కరువు సమస్యలపై మంగళవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో గంటన్నర సేపు భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఏపీలో ఎన్ని సమస్యలున్నా వాటికి అతీతంగా టీడీపీ-బీజేపీ స్నేహాన్ని కొనసాగిద్దామని ప్రధాని మోడీ చెప్పినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు రెవెన్యూ లోటు, రాజధాని సమస్యలు గురించి ప్రధానితో గట్టిగా మాట్లాడతానని విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అధికారులతో రెండు రోజులు పాటు చంద్రబాబు కసరత్తు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రధాని మోడీతో భేటీ అనంతరం హామీల అమలు గురించి గట్టిగా చెప్పలేకపోయారు. అంతేకాదు మీడియా ఆశిస్తున్న 'మసాల వార్త' ఏదీ తాను చెప్పబోవడంలేదని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా, ఆర్ధిక లోటు పూడ్చకపోయినా బీజేపీతో చేసుకోవడం లేదని చెప్పినట్లే అర్ధమవుతోంది.
అంతేకాదు హామీల అమలుపై ప్రధాని గట్టి హామీ ఇవ్వకపోయినా స్నేహంగా ఉందామని చెప్పారు కనుక రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కూడా అందుకు అంగీకరించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆ స్నేహం ఢిల్లీ వరకే పరిమితం చేసి రాష్ట్ర బీజేపీతో మాత్రం అంటిముంటనట్లు వ్యవహారించాలని ఆ పార్టీ ఎంపీ రాయపాటి మాటలతో అర్ధం అవుతోంది.

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజధాని అమరావతికి అన్ని లక్షల కోట్లు ఎందుకు? అనకాపల్లిలో ప్రభుత్వ కార్యాలయానికి, రాజధాని అమరావతిలో కార్యాలయానికి ఏమిటి తేడా? బీజేపీ పరిపాలనా వికేంద్రీకరణ కోరుకుంటోందని చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు అడిగితే అన్నీ ఇవ్వడం సాధ్యం కాదు" అంటూ సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలకు టీడీపీ ఎంపీ రాయపాటి గట్టిగానే బదులిచ్చారు. 'సోము వీర్రాజుకి రాజధాని గురించి ఏమి తెలుసని దాని గురించి మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతున్నారు.' అని అన్నారు.
'సోము వీర్రాజు వ్యాఖ్యల వల్ల టీడీపీ-బీజేపీ సంబంధాలు దెబ్బతింటాయి. అంతే కాదు అటువంటి మాటల వలన బీజేపీకి కూడా చాలా నష్టం కలుగుతుందని తెలుసుకొంటే మంచిది. టీడీపీతో కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది బీజేపీయేనని ఆయన గ్రహిస్తే మంచిది. ఇకనైనా అయన రెండు పార్టీల సంబంధాలు చెడే విధంగా మాట్లాడుకోవడం తగ్గించుకొంటే మంచిది," అని అన్నారు.
ఇటీవల విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం తర్వాత మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మిత్రధర్మానికి కట్టుబడి రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ ఆరోపణలకు దీటుగా జవాబులు చెప్పలేకపోతే, ప్రజల దృష్టిలో వారిని టీడీపీ దోషిగా నిలబెడుతోంది కనుక వారు తప్పనిసరిగా గట్టిగానే ఖండిస్తుంటారు.












Click it and Unblock the Notifications