ఏపీలో టీడీపీ చాప్టర్ క్లోజ్ , చంద్రబాబుతో వైసీపీ మైండ్ గేమ్ .. అసహనంతో ఆయన ఏమన్నారంటే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార , ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తిరుపతిలో పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైందని, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ టిడిపి కనుమరుగవుతుందని, త్వరలో టిడిపి జెండా పీకేస్తారని తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తున్నాయి. వైసీపీ నేతలు చంద్రబాబుతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.

టీడీపీ పనైపోయిందని , త్వరలో మూత పడుతుందని పదేపదే టార్గెట్ చేస్తున్న కొడాలి నాని
చంద్రబాబు టిడిపి బండిని లాగలేక పోతున్నాడు అంటూ, త్వరలో టిడిపి మూతపడుతుంది అంటూ వైసీపీ మంత్రులు చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదని, చంద్రబాబు వృద్ధుడై పోయాడని, ఇక లోకేష్ పప్పు గాడు అని, అతని వల్ల పార్టీని నడపటం కాదని పదే పదే విమర్శిస్తున్నారు. జగన్ దెబ్బకు టీడీపీ కుప్పకూలిందని , ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నుంచి పలాయనం చిత్తగించింది అని పదే పదే టార్గెట్ చేస్తున్నారు.

టీడీపీ చాప్టర్ క్లోజ్ .. బంగాళాఖాతంలో విలీనం చెయ్యాలంటున్న సాయిరెడ్డి తదితరులు
చంద్రబాబు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ , లోకేష్ టీడీపీకి గుదిబండ అంటూ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ పనైపోయింది అన్న విషయాన్ని చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో టిడిపి టిఆర్ఎస్ పార్టీలో విలీనం అయినట్టే ఏపీలో కూడా టిడిపి బీజేపీతో విలీనం అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో విలీనం చేస్తారేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ త్వరలో కృష్ణార్పణమో , గోదావరిలో నిమజ్జనమో కావాల్సిందేనంటూ మరికొద్ది రోజుల్లో ఏపీలో టీడీపీ దుకాణం క్లోజ్ అవుతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రబాబుకు నిరాశ నిస్పృహలు మిగిలాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీ ఉండదని వదంతులపై చంద్రబాబు ఫైర్ ..
ఇక ఈ విమర్శలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని తెలుగుదేశం పార్టీ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. టిడిపి ఉండదని వదంతులు సృష్టిస్తున్నారని నిప్పులు చెరుగుతున్న చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి మాఫియాను చూడలేదని మండిపడ్డారు. తెలుగు జాతి ఉన్నంత కాలం టిడిపి ఉంటుందని పేదలు బడుగుల కోసం ఎన్టీఆర్ పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకున్న చంద్రబాబు, తిరుపతిలో టిడిపి గెలిస్తేనే వైసీపీ అరాచకాలు కొంతమేర తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

టీడీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ మైండ్ గేమ్ .. టీడీపీ క్లోజ్ అంటూ ప్రచారం
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన, బెదిరింపులు , వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ , ప్రభుత్వ భూముల అమ్మకం వంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న టిడిపి నేతలు వైసీపీ ని టార్గెట్ చేస్తుంటే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఓటమిని ప్రధానంగా ప్రచారం చేస్తూ, టిడిపి పనైపోయిందని, తెలుగుదేశం పార్టీ త్వరలో మూత పడుతుందని వైసీపీ నేతలు ప్రచారాన్ని సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications