ప్రతిపక్ష నేతగా నాడు డిమాండ్ : సీఎంగా జగన్ చేయలేరా: చంద్రబాబుకు ఛాన్స్ ఇచ్చేలా..!!
వైయస్ వివేకా హత్య కేసు ముఖ్యమంత్రికి సమస్యగా మారుతోందా. ఇప్పటికీ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి. నాడు ప్రతిపక్ష హోదాలో జగన్ చేసిన డిమాండ్ నే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేయనిది..ఇప్పుడు జగన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా డిమాండ్ చేసిన జగన్..ఇప్పుడు అధికారంలోకి వచ్చి చేయలేకపోతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తవుతున్నా వివేకా హత్య కేసు కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు..ప్రధానంగా చంద్రబాబు దీని పైన ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్కు దమ్ముంటే తన బాబాయ్ని చంపిన నిందితులను బయటపెట్టాలని సవాల్ విసిరారు. చేతకాకుంటే కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేతగా నాడు జగన్ డిమాండ్...
నాటి ప్రతిపక్ష నేత..వైసీపీ అధినేత తన పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్ధుల జాబితా విడుదలకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే రోజు వివేకా హత్య జరిగింది. ఆ వెంటనే జగన్ పులివెందుల వెళ్లారు. అక్కడ హత్య సమయంలో జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఈ హత్య వెనుక ఉన్న వారిని పట్టుకోవాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రభుత్వం ఆధీనంలోనే పని చేస్తుందని..ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసారు. దీని పైన వివేకా కుమార్తె సైతం ఇదే డిమాండ్ చేసారు. అయితే, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సీబీఐకి అంగీకరించలేదు. ఆ తరువాత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. మూడు నెలలు పూర్తయింది. తాజాగా వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఇదే అంశాన్ని రాజకీయంగా మలచుకుంటున్నారు. గతంలో మొద్దు శ్రీను హత్య కేసులో అనుమానితులు ఒక్కొక్కరుగా హత్యు గురయ్యారంటూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తన బాబాయ్ని చంపిన నిందితులను బయటపెట్టాలని సవాల్ విసిరారు. చేతకాకుంటే కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ కడపలో మకాం వేసారు. వివేకా హత్య కేసు గురించి సిట్ అధికారులతో సమీక్షించారు. వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే కేసు కొలిక్కి తేవాలని ఆదేశించారు.

జగన్ సీబీఐకి ఇవ్వకపోవటం పైనే...
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తన చిన్నాన్న హత్య మీద సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసిన జగన్..ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే అంశాన్ని టీడీపీ..జనసేన రాజకీయ అస్త్రంగా మలచుకుంటోంది. తన సొంత చిన్నాన్న హత్య చేసిన వారిని పట్టుకోలేని ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు వందల సంఖ్యలో అనుమానితులను..నిందితులను విచారించిన పోలీసులు ఏం తేల్చారనేది బయటకు రాలేదు. హత్య జరిగి ఆరు నెలలు పూర్తి కావచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య గురించి చంద్రబాబు అనేక ఆరోపణలు చేసారు. సొంత ఇంట్లో బాబాయ్ హత్య జరిగితే సాక్ష్యాలు తారు మారు చేసిన వారు అధికారంలోకి వస్తే శాంతి భద్రతలను ఎలా కాపాడుతారని నిలదీసారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి ఇదే అంశం మీద డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో..డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి ఇదే అంశం పైన స్పందించారు. నిందితులను బయట పెట్టటం చేతకాకపోతే వెంటనే కేసు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ సమీక్ష తరువాత దీని పైన స్పష్టత వస్తుందా..లేక సీఎం మరింత జాప్యం అవసరం లేకుండీ కేసు పైన ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications