జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తప్పదా?: రేపు కుప్పానికి చంద్రబాబు: డ్యామేజ్.. కంట్రోల్ అవుతుందా?
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం.. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాల్లో చంద్రబాబు అక్కడే గడుపుతారు. మండలాలవారీగా సమీక్షలను నిర్వహిస్తారు. అనంతరం బహిరంభ సభలో ప్రసంగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన పరాభవం నేపథ్యంలో చంద్రబాబు మరోసారి కుప్పానికి బయలుదేరబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టీమిండియా అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్: కోహ్లీ స్థానాన్ని ఆక్రమించిన పాక్ ఓపెనర్
టీడీపీకి కంచుకోటగా..
ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తోన్నారు అక్కడి ఓటర్లు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని అసెంబ్లీ స్థానాల్లో ఇదీ ఒకటి. టీడీపీ అభ్యర్థిగా 1989లో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేశారు. ఇప్పటిదాకా వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు. మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు.
మసకబారుతోన్న ఛరిష్మా..
అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఛరిష్మా మసకబారింది. టీడీపీ కోటకు బీటలు ఏర్పడ్డాయి. దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది పార్టీ. టీడీపీ అధినేత పోటీ చేసినా సరే.. గెలవడానికి చెమటోడ్చక తప్పదనే రాజకీయ వాతావరణ కుప్పంలో నెలకొంది. ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ స్థానంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనం..
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి టీడీపీ బలహీనడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ స్థాయిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా.. గట్టీ పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్సార్సీపీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే- ఈ స్థానాన్ని అవలీలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.
జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం అధికంగా..
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ తెలుగుదేశం పార్టీని బలహీనపరిచిందనే అభిప్రాయాలు లేకపోలేదు. పార్టీ అధ్యక్ష స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గంలో బాగా వినిపిస్తోంది. చంద్రబాబు ఎప్పుడు పర్యటనకు వచ్చినా.. ఈ డిమాండ్ వినిపించి తీరుతోంది. జూనియర్ పేరు మీద బ్యానర్లు వెలుస్తున్నాయి. చంద్రబాబు ముందే ఈ డిమాండ్ను వినిపించిన సందర్భాలు లేకపోలేదు. ఇదివరకు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన ముందే స్థానిక టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది కుప్పం నియోజకవర్గంలో.
పార్టీలకు అతీతంగా పాలన..
కుప్పంలో పార్టీ బలహీనపడటానికి మూడు అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఒకటి- జగన్ సర్కార్ పరిపాలన తీరు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటివద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న యువతీ యువకులు వలంటీర్లుగా నియమితులు కావడం, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు.
మూడు రోజులు అక్కడే మకాం..
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఆయన మకాం వేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేదు ఫలితాలను ఎదురైన నేపథ్యంలో- ఆయన నిర్వహంచ తలపెట్టిన ఈ టూర్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన సమయంలో కూడా చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ తరువాత నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి. చంద్రబాబు స్వయంగా వచ్చి మకాం వేసినా సత్ఫలితాలు రాలేదు.
Recommended Video
ఇప్పుడు మళ్లీ
నిజానికి చంద్రబాబు ఈ నెల 11వ తేదీ నాడే కుప్పానికి వెళ్లాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు పర్యటించడానికి అవసరమైన షెడ్యూల్ను కూడా రూపొందించుకున్నారు. అనుకోని పరిస్థితుల వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ఆయన ఈ పర్యటనను తలపెట్టారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పానికి వెళ్తారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల నాయకులతో సమావేశమౌతారు. గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో పర్యటిస్తారు.