సచివాలయంలో కరోనా కల్లోలం- వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వరా- చంద్రబాబు ఫైర్
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే సచివాలయంలోని సాధారణ పరిపాలన, ఆర్ధిక, పంచాయతీరాజ్ విభాగాల్ల్లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు కరోనాతో మృత్యువాత పడ్డారు. అయినా ప్రభుత్వం ఇంకా సచివాలయం నుంచే విధులు నిర్వర్తించాలని ఉద్యోగులను కోరుతోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఏపీ సచివాలయంలో తాజాగా సాధారణ పరిపాలనశాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న రవికాంత్, ఆర్ధికశాఖలో అసిస్టెంట్ సెక్రటరీ పద్మారావు, పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ శాంతకుమారి కరోనా బారిన పడి చనిపోయారు. మరికొందరు ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్లు తాజాగా పరీక్షల్లో వెల్లడైంది. అయినా ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇవ్వడం లేదు. దీనిపై స్పందించిన విపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా బారిన పడి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపం, అవగాహనా రాహిత్యంతో ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ ఉద్యోగుల రక్షణపై ఎందుకు శ్రద్ద పెట్టడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ాలు బయటపెట్టకుండా ఉద్యోగులను మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరురావాలని బెదిరింపులకు దిగడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు.
కరోనాపై సీఎం జగన్ అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని చంద్రబాబు అన్నారు. ఆదాయం కోస మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి ప్రభుత్వం వేధించిందని చంద్రబాబు ఆరోపించారు. కరోనా నియంత్రణ వైఫల్యంలో సీఎం జగన్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచారని విమర్శించారు. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ను వెంటనే పూర్తి చేయాలని, ఉద్యోగులకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.