YS జగన్ ఆయువుపట్టే చంద్రబాబు టార్గెట్
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తమకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని భావిస్తున్న చంద్రబాబు అందుకు తగ్గట్లుగా తన ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తున్నారు.

పులివెందులోనే గెలవలేరు
175 నియోజకవర్గాల్లో గెలిపించాలని జగన్ కోరుతుండగా, 175 కాదు కదా పులివెందులలో కూడా గెలవలేరంటూ చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఇటీవల బాబు కర్నూలు జిల్లా పర్యటన ఆయనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు ప్రాంతాల్లో ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. చంద్రబాబు రోడ్ షోలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. అందుకే ఈసారి గెలుపు తనదేననే ధీమాలో బాబు ఉన్నారు.

అందుకే ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించింది..
రాయలసీమలోని ఉమ్మడి జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు వైసీపీకి పట్టుగొమ్మగా ఉన్నాయి. వైసీపీకి ఆయువుపట్టులాంటి జిల్లాలోనే ఆదరణ రావడంతోపాటు మదనపల్లెలో జరిగిన మినీ మహానాడు కూడా విజయవంతమవడాన్ని గుర్తుచేసుకుంటూ బాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత ఎన్నికల్లో సీమలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు జగన్ కు 49 స్థానాలు దక్కాయి. ఇక్కడే జగన్ కు పట్టుంది కాబట్టి ఇక్కడే దెబ్బకొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ గడ్డపైనే తనకు చివరిఛాన్స్ అని, అవకాశం ఇవ్వాలని కోరారు. సీమ గడ్డపైనే ఈ పదాన్ని ఉపయోగించడంవల్ల రాజకీయంగా లాభం ఉంటుందని బాబు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నియోజకవర్గాలను గెలుచుకోగలిగితే అధికారం సులువుగా దక్కుతుందని భావిస్తున్నారు.

ప్రాంతాలవారీగా బలాలపై దృష్టి
మిగతా ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, కోస్తాలో సులభంగానే గెలవచ్చని భావిస్తున్నారు. అయితే కోస్తా, ఉత్తరాంధ్రలో చంద్రబాబును దెబ్బతీయగలిగితే తనకు మరోసారి అధికారం దక్కుతుందని జగన్ భావిస్తున్నారు. ఆ దిశగానే ఆయన ఎన్నికల వ్యూహాలున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల కాలం నుంచి చంద్రబాబు రాయలసీమపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఇక్కడ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. తనను కుప్పంలో ఓడించడానికి జగన్ ప్రయత్నిస్తుంటే, జగన్ ను పులివెందులలో ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రాంతాలవారీగా లెక్కలు వేసుకొని ఏయే ప్రాంతాల్లో ఎవరికి బలం ఉంది? వారిని ఎలా దెబ్బతీయాలి? మన బలం ఎలా పెంచుకోవాలి? తదితర అంశాలను ఇద్దరు అధినేతలు అమలు పరుస్తున్నారు.












Click it and Unblock the Notifications