అందరూ జగన్ పీడిత బాధితులే.. చిత్ర పరిశ్రమ టీడీపీకి సహకరించలేదు.. చిరంజీవిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు . 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం వల్లే టీడీపీకి విజయం దక్కకుండా పోయిందని పేర్కొన్నారు. పార్టీ పెట్టకుండా ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు.. పెట్టిన తర్వాత కూడా తమతో బాగానే ఉన్నామని చెప్పారు. రాజకీయాల్లో పోరాటం అనేది ఒక ఆటతో భాగమన్నారు. చిరంజీవి ఇప్పుడు కూడా తనతో బాగానే ఉన్నాయన్నారు.

టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించలేదు
సినిమా టికెట్ల ధరల వివాదంలోకి టీడీపీని ఎందుకు లాగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సినీ పరిశ్రమకు టీడీపీకి ఏం సంబంధముందన్నారు. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించలేదని పేర్కొన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు.. తర్వాత కూడ తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారు. అంత మాత్రాన తాను సినీపరిశ్రమపై వ్యతిరేకత ప్రదర్శించలేదని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ నిలదొక్కొవాల్సిన అవసరం ఉందన్నారు. తన పాలనలో సినీ పరిశ్రమను ప్రొత్సహించామని పేర్కొన్నారు.

సిమెంటు ధరలపై జగన్ ఎందుకు మాట్లాడరు?
సినిమా టికెట్ల ధరపై తెగ మాట్లాడుతున్న సీఎం జగన్.. సిమెంటు ధరలపై ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇటీవల భారతీ సిమెంట్ ధరలు కూడా పెంచుకున్నారని విమర్శించారు. సొంత కంపెనీ ఉంది కదా అని ఇష్టానుసారంగా ధరలను జగన్ పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ పాలనతో అందరూ పీడిత బాధితులే
సీఎం జగన్ పాలనలో అందరూ పీడిత బాధితులే చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మండిపడ్డారు. సంక్రాంతి పండుగ వస్తుందన్న సంతోషం కూడా ప్రజల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇది ప్రతి ఆంధ్రుడి బాధ్యత అని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎడగతామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, బెదిరించినా టీడీపీ ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను నిండా మోసం చేసిందని విమర్శించారు.
Recommended Video

ఇన్కమ్ ట్యాక్స్ కడితే అవినీతి లేనట్టేనా?
వైస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల్లో అక్రమ పెట్టుబడులు లేవని ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచ్చిందన్న దానిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా జగన్ తన సంస్ధల్లోకి రూ.1200 కోట్లు తెచ్చుకోవడం అవినీతి కాదా? అని ప్రశ్నించారు. ఇన్కమ్ ట్యాక్స్ కడితే అవినీతి లేనట్టేనా అని మండిపడ్డారు. జగన్ ది అవినీతి కాదంటే దేశంలో ఏ ఒక్క అవినీతిపరుడిని పట్టుకోలేరన్నారు. రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వ శాఖలే ఇలా వ్యవహరిస్తే అవినీతి పరులకు రాజకీయం ఒక వ్యాపారం అవుతుందని పేర్కొన్నారు. చట్ట సవరణ రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని స్పషం చేశారు.












Click it and Unblock the Notifications