బ్రహ్మనందరెడ్డిపై బాబు షాకింగ్, అదే శిల్పా సోదరులకు దెబ్బ, ముద్రగడ సత్తా తెలిసేది
అమరావతి: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి సాధించిన విజయాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. 2019 ఎన్నికలకు కూడ టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నారు.అయితే రానున్న ఎన్నికల్లో అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళకూడదని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వెళ్తే ఎన్నికల్లో నష్టపోతామని బాబు పార్టీ నేతలను హెచ్చరించారు.
జగన్కు షాక్: 6గురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి?
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు చూసి అతి విశ్వాసానికి పోవద్దని పార్టీ నేతలను టీడీపీ అధినేత సూచించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కొందరు ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.
బాబుకు మళ్ళీ దగ్గరౌతున్న హరికృష్ణ: మళ్ళీ రాజ్యసభకు
సోమవారం నుంచి ప్రారంభమయ్యే 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంపై టిడిపి నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో బాబు చర్చించారు.
అతి విశ్వాసంతో అనర్ధమే
'నంద్యాల, కాకినాడల్లో ప్రజలు మన అంచనాలకు మించి మద్దతు ఇచ్చారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందనే నమ్మకంతో ప్రజలున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ కారణంతోనే ఈ రెండు ఎన్నికల్లో ప్రజలు టిడిపిని గెలిపించారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలతో మితిమీరిన ఆత్మవిశ్వాసం పెంచుకుంటే దెబ్బ తింటాం. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. నిత్యం ప్రజల్లో ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. . ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు చంద్రబాబునాయుడు.
బ్రహ్మనందరెడ్డి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నంద్యాలలో కొత్త కుర్రాడు భూమా బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపినా ఘన విజయం సాధించడం పట్ల బాబు సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మనందరెడ్డి . మొహమాటస్ధుడు అయినా ప్రజలు గెలిపించారంటే ప్రభుత్వంపై ఉన్న సానుకూలతే కారణమని సీఎం పేర్కొన్నారు.ఎమ్మెల్యే పదవి కోసం ఆశపడి చేతిలో ఉన్న ఎమ్మెల్సీ పదవిని, కౌన్సిల్ చైర్మన్ పదవిని కూడా కోల్పోయారని పరోక్షంగా శిల్పా సోదరులను ఉద్దేశించి అన్నారు. 'మంత్రి పదవి ఇవ్వలేదని దుష్ప్రచారం చేసి ముస్లింలను టీడీపీకి దూరం చేయాలని చూశారు. మంద కృష్ణ ద్వారా మాదిగలను రెచ్చగొట్టాలని, ముద్రగడ పద్మనాభం ద్వారా కాపులను టీడీపీకి దూరం చేయాలని ప్రయత్నించారు. ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రతిపక్షం కుయుక్తులను ప్రజలు తిప్పిగొట్టారని ' చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
శ్రీకాకుళంలో ఇంటింటికి టిడిపికి బాబు శ్రీకారం
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తేతంగి గ్రామంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 11న, శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఎన్టిఆర్ విగ్రహన్ని బాబు ఆవిష్కరించనున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళనున్నట్టు బాబు ప్రకటించారు. . పార్టీ కార్యక్రమాల్లో ఎవరూ మినహాయింపు ఉండదని చంద్రబాబు చెప్పారు.
ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు యాప్
ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ప్రజలు చెప్పే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఒక యాప్ను తయారు చేసింది టిడిపి. రోజువారీగా ఆయా జిల్లాల నుండి పంపాలని సీఎం సూచించారు.ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు అహం ప్రదర్శించకూడదని బాబు సూచించారు. ఈ మూడేళ్లలో ఎన్నో చేశాం. ఇంకా సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం. ఇన్ని కష్టాల్లో ఉన్నా మనం పనులు చేస్తున్నాం కాబట్టే ప్రజల్లో మనపై 80 శాతం సంతృప్తి వస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఏం కావాలనే విషయాన్ని తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలుసు
పార్టీ కోసం నిరంతరం ఎవరు పనిచేస్తున్నారో తనకు తెలుసునని చంద్రబాబునాయుడు చెప్పారు. అందరి పనితీరును గమనిస్తూనే ఉన్నానని బాబు చెప్పారు. పని చేసేవారే నాకు ఇష్టం. పని చేయకుండా కబుర్లు చెప్పేవారిని దగ్గరకు కూడా రానివ్వనని బాబు తేల్చి చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లాలి. మనం చేసింది చెప్పాలి. ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఏ సీట్లోనైనా గెలుపు సాధ్యమే
నంద్యాల, కాకినాడల్లో గెలుపు తర్వాత మరే సీట్లోనైనా తేలికగా గెలవగలిగే పరిస్థితిలోకి వచ్చామని, రాష్ట్రంలో ఏ సీట్లోనైనా గెలుపు కష్టం కాదని అన్నారు. ‘రాయలసీమ, కోస్తాలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ప్రజలు 16 శాతం ఆధిక్యం ఇచ్చారని చంద్రబాబు ప్రస్తావించారు. ఇదే ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాలని పార్టీ నాయకులకు బాబు సూచించారు. ప్రజాసేవపై ఆసక్తి ఉంటేనే పదవులు తీసుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి' అని సీఎం పార్టీ నేతలకు సూచించారు.
ముద్రగడ ప్రచారం చేస్తే తేలేది
కాకినాడ ఎన్నికల్లో తాను ప్రచారం చేసి ఉంటే ఫలితం వేరుగా వచ్చేదని ముద్రగడ చేసిన వ్యాఖ్యను ఓ నేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘జగన్తోపాటు ఆయన కూడా వచ్చి ప్రచారం చేసి ఉంటే బాగుండేది. ప్రజల తీర్పు ఏమిటో తెలిసేది‘ అని చురక వేశారు. ఇన్చార్జులు లేని నియోజకవర్గాలకు వెంటనే ఇన్చార్జులను నియమిస్తానని, పని చేయనివారు ఉంటే వారిని తొలగించి కొత్తవారిని వేస్తానని స్పష్టం చేశారు.