ఈసారి ఎలాగైనా అక్కడ గెలవాల్సిందే!!
ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ ఊరిస్తుంటుంది. దీని పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ లోక్ సభ నియోజకవర్గాన్ని మాత్రం త్రుటిలో కోల్పోతూ ఉంటుంది. వచ్చే ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.

చివరి నిముషంలో బరిలోకి దిగిన శిద్ధా
ఒంగోలు లోక్ సభ స్థానంలో టీడీపీ కేవలం రెండుసార్లే విజయం దక్కించుకోగలిగింది. 1984లో బెజవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరాం గెలవగలిగారు. ప్రతి ఎన్నికలోను కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దక్కించుకుంటూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014లో జరిగిన ఎన్నికల్లో గెలుపునకు దగ్గరగా వచ్చింది కానీ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిపై శిద్ధా రాఘవరావును చివరి నిముషంలో నిలబెట్టారు. దీంతో ఆయన 2.14 లక్షల ఓట్ల తేడాతో అపజయాన్ని పొందారు.

బలమైన అభ్యర్థి కొరత
ఒంగోలు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి, కొండెపి, ఒంగోలు నియోజకవర్గాలున్నాయి. చంద్రబాబు నిర్వహించుకున్న సర్వేలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బలం పెరుగుతున్నప్పటికీ లోక్ సభలో బలమైన అభ్యర్థి కొరత ఎదుర్కొంటున్నట్లుగా తేలింది. దీంతో 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి నింపడానికి ఆయన పావులు కదుపుతున్నారు. నేత బలంగా ఉంటే ఆ ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా ఉంటుంది.

తూమాటి వెంకటనరసింహారెడ్డిపై మొగ్గు
మార్కాపురంకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తూమాటి వెంకటనరసింహారెడ్డిని బరిలోకి దింపడానికి అధిష్టానం కసరత్తులు ప్రారంభించింది. దీనిపై తూమాటి నుంచి ఇంకా సానుకూల స్పందన రాలేదు. రెడ్డి సామాజికవర్గం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు పార్టీ బలం కలిసివచ్చి విజయానికి సులభమైన మార్గం ఏర్పాడుతుందని పార్టీ భావిస్తోంది. ఈ విషయంలో తూమాటికి నచ్చచెబుతోంది. వరుసగా రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన వైసీపీకి ఈసారి చెక్ పెట్టాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. అందుకనుగుణంగా ఆయన వ్యూహాలురూపొందించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications