చంద్రబాబు కొత్త వ్యూహం ‘టార్గెట్-100’?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎలాగైనా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకనుగుణంగా తన వ్యూహాలను అమలుచేసుకుంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే టీడీపీకి కూడా బలమైన అభ్యర్థులు ఉండాలని యోచిస్తున్నారు. అలా అయితేనే వైసీపీని ఢీకొట్టగలమనే భావనలో చంద్రబాబు ఉన్నారు.

గెలిచే నియోజకవర్గాలు 100
నియోజకవర్గాలవారీగా సర్వేలు చేయిస్తూ పనిచేయనివారికి క్లాస్ తీసుకుంటున్న చంద్రబాబు అవసరమైన ఇన్ ఛార్జిలను మార్చేస్తానంటూ హెచ్చరిస్తున్నారు. నాయకులు పనిచేయనిచోట వారికి బదులుగా వేరే అభ్యర్థిని నియమించేబదులు మిత్రపక్షంగా ఉండేవారికి ఆ నియోజకవర్గాన్ని కేటాయించాలని భావిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల నుంచి కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకుగాను ఈసారి కచ్చితంగా 100 నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులనే పోటీకి దింపాలని, ఆ 100 కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.

ఆర్థికంగా బలవంతుల కోసం..
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులున్నచోట పోటీగా సీటు కోసం ఎవరూ అడగరు కాబట్టి అటువంటి స్థానాల్లో కూడా అభ్యర్థులు ఖాయమైనట్లే లెక్క. ఆర్థిక బలం, అంగబలం ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపడానికి సామాజికవర్గ సమతూకాన్ని కూడా పక్కనపెట్టబోతున్నారు. సామాజికవర్గంకన్నా వైసీపీని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థులుండాని భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ, రాజ్యసభ హామీతో కొత్తనేతలు?
ఎలక్షన్ మేనేజ్ మెంట్ ను కూడాఈసారి సమర్థవంతంగా, ప్రణాళికా బద్ధంగా చేయబోతున్నారు. గతంలో అభ్యర్థులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ వారికి పార్టీ నిధులు సర్దుబాటు చేసేది. ఇప్పుడు మాత్రం ఆర్థికంగా బలవంతుల కోసం ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాలు మినహా మిగతావాటిలో చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చారు. లోక్ సభకు ఎంపిక చేసే అభ్యర్థుల విషయంలోను ఇదే పద్ధతిని పాటించబోతున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలను ఇస్తామని హామీ ఇచ్చి అయినా కొత్త నేతలను తీసుకురావాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications