నేను సీఎం అయితే- నెల రోజుల్లో ఏం చేస్తారో చెప్పేసిన చంద్రబాబు
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా అసెంబ్లీని సైతం బహిష్కరించి ప్రజల్లో తిరుగుతున్నారు. తాజాగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయాల్లో కీలకంగా పనిచేసిన నేతల్ని స్వయంగా కలుసుకుని ఆయన అభినందిస్తున్నారు. సమష్టిగా పోరాడితే వైసీపీని మట్టికరిపించడం అంత కష్టమేమీ కాదని నేతలకు ఆయన చెప్తున్నారు. ఇదే కోవలో ఆయన ఇవాళ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
ఏపీలో పేదలకు ఇళ్లపై హక్కులు కల్పించేందుకు వైసీపీ సర్కార్ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఇళ్లు తీసుకుని వాటిపై హక్కులు లేని వారు పది వేలు కడితే చాలు ఇళ్లపై హక్కులు కల్పిస్తామని చెబుతోంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాము ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న ఇళ్లపై హక్కులు ఇస్తామంటూ పది వేలు తీసుకోవడమేంటని పేదలు మండిపడుతున్నారు. అయితే ఇది స్వచ్చంధమే అని ప్రభుత్వం చెబుతోంది. అయినా వారు నమ్మడం లేదు.

దీనిపై ఇవాళ స్పందించిన చంద్రబాబు.. తాను సీఎం అయ్యాక అందరికీ ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు.
తాను సీఎం అయిన నెల రోజుల్లోనూ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని గుంటూరులో ప్రకటించారు. గురజాల నియోజకవర్గ టీడీపీ నేతలతో చంద్రబాబు ఇవాళ భేటీ అయ్యారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే గురజాల, దాచేపల్లి మునిసిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. టీడీపీకి చెందిన 8 మంది కార్యకర్తల హత్యకు సీఎం జగన్ సమాధానం చెప్పగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకి, ఇచ్చిన ఇంటి స్థలాలకు ఇప్పుడు పట్టా ఇస్తామని చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పట్టాలకు రూ.10 వేలు ఎందుకు కట్టాలన్నారు. ఉచితంగా ఇళ్లు పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు పేర్కొన్నారు.

Recommended Video
ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో పేదలను ఇబ్బందిపెడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి రాగానే ఉచితంగానే ఇళ్ల పట్టాలు ఇస్తామని టీడీపీ హామీ ఇస్తోంది. దీంతో వైసీపీ ఈ వ్యవహారంలో టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన చంద్రబాబు ఇప్పుడు తానే ఆ హామీని ఇస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications