చంద్రబాబు పర్యటన ఫిక్స్: షెడ్యూల్ ఇదే: ఇక జనం మధ్యే
అమరావతి: రాష్ట్రంలో గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవకపోవడం వల్ల వరదపోటు తగ్గింది. గోదారమ్మ శాంతించింది. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట్టం 18.1 అడుగులకు తగ్గింది. ముందుజాగ్రత్త చర్యలను అధికారులు తీసుకుంటోన్నారు. మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తోన్నారు. ప్రస్తుతం సముద్రంలోకి 19.73 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోన్నారు.
ధవళేశ్వరం బ్యారేజి వద్ద వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు వదిలి వేస్తోన్నారు. గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 20 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వరద పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టేంత వరకూ లంక గ్రామవాసులు, గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తోన్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో వరద ప్రభావిత జిల్లాల అధికారులు రంగంలో దిగారు.
రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. మొత్తంగా ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో మొత్తం 385 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. మరో 241 గ్రామల్లోకి వరదనీరు చేరినట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
84,734మందిని 191 పునరావాస కేంద్రాలకు తరలించారు. 256 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 1,25,015 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారమే తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులకు అందుతోన్న సహాయం గురించి ఆరా తీశారు.
కాగా- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. బుధవారం ఆయన పర్యటన మొదలవుతుంది. వరుసగా మూడు రోజుల పాటు ఆయన ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు. 20వ తేదీన కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తారు. బాధితులను పరామర్శిస్తారు. నీట మునిగిన పంటపొలాలను తిలకిస్తారు. 21వ తేదీన కూనవరం, చింతూరు, ఎటపాక, వీ ఆర్ పురం మండలాలు, 22వ తేదీన రాజోలు, పీ. గన్నవరం నియోజకవర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.