జిల్లాల టూర్ మొదలుపెట్టేస్తున్న చంద్రబాబు-మహానాడుకు ముందే-కారణమిదేనా ?
ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎఁ జగన్ జిల్లాల పర్యటనలు చేపడుతుండగా.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే బాట పట్టబోతున్నారు. ఏటా పార్టీ తరఫున నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటున్న చంద్రబాబు.. ఆ తర్వాత జిల్లాల టూర్ ప్రారంభించాలని ముందు భావించారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఏపీలో ప్రస్తుతం టీడీపీ బాదుడే బాదుడు పేరుతో వైసీపీ ప్రభుత్వం పెంచిన పన్నులు, ఛార్జీలపై పోరాటం చేస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ జిల్లాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం మహానాడుకు ముందే టూర్ షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

చంద్రబాబు తాజాగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం మే 4న శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో పర్యటించనున్నారు. మే 5న భీమిలి నియోజవర్గం తాళ్లవలస గ్రామంలోనూ, 6న తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజవర్గం కోరింగ గ్రామంలో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రభుత్వం పెంచిన పన్నులు, ఇతరత్రా బాదుడుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న టీడీపీ నేతలు మహానాడు వరకు వివిధ జిల్లాలలో ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. ఇందులో పాల్గొనడం ద్వారా కార్యకర్తల్ని మహానాడుకు సిద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల్లో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఛార్జీల పెంపు నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహానాడు వరకూ ఆగి ఆ తర్వాత జిల్లాల పర్యటనలు చేస్తే అంతగా ప్రయోజనం ఉండదని భావిస్తున్న చంద్రబాబు.. ముందుగానే రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓవైపు సీఎం జగన్, మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో తిరుగుతున్న నేపథ్యంలో తాను ఇంటికి పరిమితమైతే కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications