తిరుపతి ప్రచారంలోకి చంద్రబాబు- ఎల్లుండి నుంచి 8 రోజుల పాటు- 7 సభలు
ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి విజయం కోసం ఎమ్మెల్సీ నారా లోకేష్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, యువనేతలు ప్రచారం సాగిస్తుండగా.. ఎల్లుండి నుంచి చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు.
తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి ఈ నెల 8 నుంచి అడుగుపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. సత్యవేడు నుంచి చంద్రబాబు ప్రచారం ప్రారంభం కానుంది. 8 రోజుల పాటు సాగే ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు బహిరంగసభల్లో పాల్గొంటారు. ఏకబిగిన సాగే చంద్రబాబు ప్రచారం ఈ నెల 15న ముగియనుంది. అదే రోజు తిరుపతి ఉపఎన్నికల్లో అభ్యర్ధుల ప్రచారం కూడా ముగియుంది. ఈ నెల 17న తిరుపతిలో ఉపఎన్నిక జరగనుంది.
తిరుపతి టీడీపీ లోక్సభ అభ్యర్ధిగా పనబాక లక్ష్మి మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆమెకు మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. తిరుపతి పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈ లోక్సభ సీటులో టీడీపీ గెలుపు కోసం నేతలు శ్రమిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే స్ధానం నుంచి బరిలోకి దిగిన పనబాక లక్ష్మి అప్పటి వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో 2.2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.