గోదావరి వరద ప్రాంతాల్లో చంద్రబాబు టూర్-బోటులో ప్రయాణిస్తూ బాధితుల పరామర్శ
ఏపీని తాజాగా వణికించిన గోదావరి వరదలు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వందలాది మందిని నిరాశ్రయుల్ని చేసేశాయి. ఇప్పటికీ చాలా లంకల్లో గోదావరి నీరు అలాగే ఉంది. దీంతో జనం తిండి, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పాటు ఈ రెండు జిలాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఏలూరు జిల్లా నుంచి చంద్రబాబు టూర్ ప్రారంభమైంది.
ఉదయం అయోధ్య లంక నుంచి టాప్ లెస్ వాహనంలో ప్రయాణం ప్రారంభించిన చంద్రబాబుకు దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. దీంతో మధ్యలో ఎక్కడా ఆగకుండానే చంద్రబాబు తన టూర్ కొనసాగించారు. అయోధ్య లంక దాటిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాల్లో రాకపోకలు చేసే పరిస్ధితి లేకపోవడంతో బోట్లపై వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో చంద్రబాబుతో పాటు ఇతర నేతలు లైఫ్ జాకెట్లు వేసుకుని బోట్లపై వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు. స్ధానికుల్ని ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం నిత్యావసరాలు ఇస్తున్నట్లు చెబుతున్నా అవి వారికి పూర్తిస్ధాయిలో అందడం లేదు. దీంతో తమ ప్రాంతాలకు వచ్చిన చంద్రబాబుకు వారు సమస్యలు విన్నవిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాగైనా తమకు సాయం అందేలా చూడమని కోరుతున్నారు. దీంతో చంద్రబాబు కూడా వారి సమస్యల్ని సావధానంగా వింటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిత్యావసరాలతో పాటు ఆర్ధిక సాయం కూడా అందేలా చూస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో వారికి కాస్త ఊరట దక్కుతోంది.