అది వైసీపీపై వ్యతిరేకతకు నిదర్శనం... తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితంపై చంద్రబాబు రియాక్షన్...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అరాచకాలు, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైసీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకం అన్నారు.వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. పోరాటమే మన ఊపిరి అని టీడీపీ శ్రేణులను ఉద్దేశించి పేర్కొన్నారు.
అప్రజాస్వామికంగా అనైతిక కార్యకలపాలతో ఐదు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైసీపీ శ్రేణులకు తిరుపతి ఓటర్లు బుద్ది చెప్పారని... వారికి అభినందనలు చెబుతున్నానని అన్నారు.ఫలితం ఏదైనా నైతిక విజయం మాత్రం తమదేనన్నారు.

తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019లో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సాధించిన 2,28,376 ఓట్ల మెజారిటీని గురుమూర్తి అధిగమించడం విశేషం. మొత్తంగా 5లక్షల 30వేల పైచిలుకు ఓట్లు గురుమూర్తికి పోలయ్యాయి.
గురుమూర్తి విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. '23 నెలల పాలన తర్వాత తిరుపతిపార్లమెంట్కు జరిగిన ఉపఎన్నికలో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజార్టీతో దీవించారు. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజార్టీతో ఆశీర్వదించారు. వారు మనపై చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పది. ఈ విజయం నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ..ఈ విజయం సాధ్యమైంది.' అని జగన్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications