టిడిపి పొలిట్బ్యూరో: జయ పేరు చెప్పి వైఎస్పై, ప్రకాశం బ్యారేజీ దాటగానే...
జయలలితపై కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ వైఎస్పై టిడిపి నాయకులు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో గంటా, అయ్యన్నల వైరంపై కూడా వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సమావేశంలో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసుపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ వాటిలో ఒకటి.
మరోటి తెలుగుదేశం పార్టీలోని అంతర్గత తగాదాలపై మరో చర్చ. విభేదాలను పక్కన పెట్టి సర్దుకుపోవాలని చంద్రబాబు చెబుతూ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడి మధ్య విభేదాలు సమసిపోయాయని ఉదరించినప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జగన్ కేసులో వైయస్ రాజశేఖర రెడ్డిని పిలిచి విచారిస్తారా అని రమాకాంత్ రెడ్డి సాక్షి కార్యక్రమంలో ప్రశ్నించారు. దానిపై టిడిపి పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చ సాగింది. ఈ సందర్భంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితపై కోర్టు చెప్పిన తీర్పు ప్రస్తావన వచ్చింది.

మరణించినా జయలలితకు ఫైన్
జయలలిత మరణించినా కూడా ఆమెకు కోర్టు జరిమానా విధించిందని, అదే కేసులో శశికళకు శిక్ష పడిందని, ముద్దా యి చనిపోయినంత మాత్రాన ముద్దాయి కాకుండా పోరని, అది జయలలిత అయినా..మరెవరైనా అని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాలువ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్ కేసుల విషయంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమాకాంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారు ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు.

రమాకాంత్ రెడ్డి వాదన తప్పు...
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా జగన్పై సీబీఐ విచారణ జరపడమేమిటని రమాకాంత్రెడ్డి ప్రశ్నించడం తప్పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీబీఐకి నిబంధనలు తెలియవని ఓ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి మాట్లాడటం సరి కాదని ఆయన రమాకాంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వైఎస్ చనిపోయారని, అప్పటి కేబినెట్ నిర్ణయాలపై ఇప్పుడు ఎవరిని అడుగుతారని రమాకాంత్రెడ్డి ప్రశ్నించడాన్ని తప్పు పడుతూ చనిపోయినంత మాత్రాన తప్పులు మాసిపోవని ఆయన అన్నారు. జగన్ మంత్రివర్గ సమావేశాలకు హాజరు కాకపోయి ఉండవచ్చని, అయినా అతని క్విడ్ప్రోకో వ్యవహారం బహిరంగంగా అక్రమాస్తుల రూపంలో కనిపిస్తోందని కాలువ శ్రీనివాసులు అన్నారు.

విభేదాలపై చంద్రబాబు ప్రస్తావించినప్పుడు...
పార్టీ నేతల మధ్య విభేదాలపై చంద్రబాబు పోలిట్బ్యూరో సమావేశంలో ప్రస్తావించినప్పుడు ఆసక్తికరమైన చర్చ నడిచింది. విశాఖ జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులపై పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేసిన వ్యాఖ్య అందరినీ నవ్వించింది.. పార్టీ నేతలంతా కలసి పని చేయాలంటూ విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం జిల్లా నేతలకు తాను స్పష్టంగా అదే చెప్పానని చంద్రబాబు అన్నారు.

వారు ఇక్కడే ఉన్నారు...
విభేదాలకు స్వస్తి చెప్పి అందరూ పని చేయాల్సిందేనని చంద్రబాబు అంటూ అయ్యన్న ఇక్కడే ఉన్నాడని గంటాతో కలిపి అయ్యన్నకు అదే చెప్పానని అన్నారు. దాంతో ఇద్దరూ చేతులో చేయి వేసుకొని కలిసి వెళ్ళారని చెప్పారు. చంద్రబాబు ఆ మాట చెప్పారో లేదో సోమిరెడ్డి స్పందించారు. "మీ దగ్గర కలిసి ఒకే కార్లో కూర్చొని మరీ వెళ్లారు. ప్రకాశం బ్యారేజీ దాటగానే దిగి ఎవరి కారులో వాళ్లు వెళ్ళిపోయారు" సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

అందరం కలిసే పనిచేస్తాం...
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యకు అందరూ పక్కున నవ్వారు. అయితే అయ్యన్నపాత్రుడు మాత్రం భుజాలు తడుముకున్నట్లున్నారు. "లేదు సార్. కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తాం" అని ఆయన చెప్పారు. గంటాకు, అయన్నపాత్రుడికి మధ్య చాలా కాలంగా అంతర్గత తగాదాలున్నాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు..












Click it and Unblock the Notifications