మాచర్ల దాడులపై NHRCకి టీడీపీ ఫిర్యాదు-వైసీపీకి పోలీసుల సహకారంపై-నిష్పాక్షిక విచారణకు వినతి
పల్నాడు : మాచర్లలో చోటు చేసుకున్న దాడులపై జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. మాచర్లలో జరిగిన దాడులు, టీడీపీ నేతల్ని వైసీపీ లక్ష్యంగా చేసుకోవడం, పోలీసులు వారికి సహకరించడం వంటి అంశాలపై ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు.
పోలీసుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, అధికారపార్టీతో కొంతమంది పోలీసులు కుమ్మక్కవడంతో రాష్ట్రంలో పౌరుల రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నట్లు హెచ్చార్సీకి రాసిన లేఖలో టీడీపీ నేత వర్ల తెలిపారు. మాచర్ల ఘటనే ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి తన ప్రైవేటు గూండాలతో దాడికి పాల్పడ్డాడని, ప్రతిపక్షపార్టీ సభ్యుల గృహాలపై దండెత్తి మహిళలు, పిల్లలు అని తారతమ్యం లేకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఇళ్లను తగుబెట్టారన్నారు.
టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి చేస్తున్న శాంతియుత ర్యాలీపై దాడి చేయడంతో ఈ దుర్మార్గాలకు ఒడిగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిపక్షనేతల ఇళ్లల్లోని విలువైన ఆభరణాలు సైతం దొంగిలించుకుపోయారని, దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ ఘోరకలిని చూస్తూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. పోలీసులు కార్డెన్ సర్చ్ చేసిన తర్వాత కూడా వైసీపీ గూండాలు ప్రతిపక్షనేతలపై మారణాయుధాలతో దాడి చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షపార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి మాచర్ల టౌన్ వదిలి వెళ్లాలని హుకుం జారీ చేశారన్నారు. గత కొన్ని నెలలుగా ప్రజలు మాచర్లను వదిలి బయటకు పోయే పరిస్థితులు నెలకొన్నాయని ఫిర్యాదులో తెలిపారు.
మాచర్లలో అధికార పార్టీ నాయకుల ప్రైవేటు గూండాలు 16 మందిని హత్య చేసినా పోలీసులు హంతకులను అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ ఆరోపించింది. మాచర్ల ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నివాసాలు విడిచిపెట్టి జిల్లా హెడ్ క్వాటర్ గుంటూరులో తలదాచుకున్న రోజులు ఇంకా మరిచిపోలేదన్నారు. మాచర్ల ప్రాంతంలో శాంతిభద్రతల క్షీణించడానికి పోలీసు డిపార్ట్ మెంటులోని కొంతమంది ఉన్నతాధికారులే కారణమన్నారు. ఇంటలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, ఎస్పీ రవిశంకర్ రెడ్డి లు అధికార పార్టీ నేతలను సంతోషపెట్టడానికి శాంతిభద్రతలను పణంగా పెట్టారని వర్ల తన ఫిర్యాదులో ఆరోపించారు. మాచర్ల ఘటనపై, పోలీసుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులకు శిక్షపడేలా చూడాలని కోరారు. తద్వారా రాజ్యాంగ విలువలను కాపాడాలన్నారు. రాజ్యాంగపరమైన తమ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.