బొత్సా వ్యాఖ్యలతో తిప్పలు: ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేల సతమతం: టీడీపీ నేతలకు లక్ష్యంగా..!
ఏపీ రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా చేస్తున్న వరుస వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా టీడీపీ నేతలు కృష్ణా.. గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నాని ప్రశ్నిస్తున్నారు. రాజధాని ఇక్కడ నుండి తరలించటానికి ఈ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దమేనా అని నిలదీస్తున్నారు. అయితే, బొత్సా ఎక్కడా రాజధాని తరలిస్తున్నట్లుగా చెప్పలేదు. అదే సమయంలో రాజధాని తరలించే అవకాశమూ లేదని స్పష్టత ఇవ్వటం లేదు. దీంతో..ఇప్పుడు టీడీపీ నేతలు ఈ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.
రాజధాని ఉంటుందా..తరలిస్తారా అనే అంశం మీద వారు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఇదే అంశాన్ని అస్త్రంగా మలచుకుంటున్నారు. రాజధాని విషయంలో ఈ రెండు జిల్లాల నేతలే బాధ్యత తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు బొత్సా ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచిస్తున్నారు.
ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..
అమరావతిపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని కోసం 30వేల ఎకరాలు ఉండాల్సిందేనని 2014లో జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 15వేల ఎకరాలు సరిపోతాయని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రైతులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. మాట్లాడితే నిపుణుల కమిటీ అంటున్నారని నిప్పులు చెరిగారు. శివరామకృష్ణన్ కమిటీ కాదా.. అని ప్రశ్నించారు.

కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. వారిని నమ్మి ప్రజలు ఓట్లేశారని అన్నారు. అవినీతి అని, ముంపు ప్రాంతం అని, ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఇష్టమొచ్చిన ఆరోపణలు చేసి.. ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని ప్రభుత్వంపై అనురాధ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు చరిత్ర హీణులుగా మారిపోతారని, నామరూపాలు లేకుండా పోతారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
సమాధానం ఏం చెప్పాలి..
ఇప్పుడు కృష్ణా జిల్లా నుండి మొత్తం 13 మంది.. గుంటూరు జిల్లా నుండి 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీ వీరిని ఇరుకున పెట్టేందుకు ఇక్కడ రాజధాని కొనసాగింపుకు వీరు అనుకూలమా కాదా తేల్చి చెప్పాలని నిలదీస్తోంది. దీంతో..వీరు ఇరకాటంలో పడుతున్నారు. ప్రభుత్వం ఆలోచన ఏంటనేది వీరికి స్పష్టత రావటం లేదు. అదే సమయంలో రాజధానిని మంగళగిరిలో ఏర్పాటు చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. ఇదంతా ప్రభుత్వ వ్యూహంలో భాగంగా జరుగుతున్న వ్యవహారమా లేక.. ఆర్కే వ్యక్తిగత అభిప్రాయమా అనే అంశం మీద పార్టీలో చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు మాత్రం ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. వైసీపీ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం బొత్సా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన సమయంలో పార్ధసారధి లాంటి వారు రాజధాని తరలించే ఆలోచన లేదని స్పష్టం చేసారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో వైసీపీ నేతల నుండి సమాధానం రావటం లేదు. దీని పైన ఈ రెండు జిల్లాల అంతర్గత చర్చల్లో ఇప్పుడు ఇదే ప్రధానంగా మారుతోంది. జిల్లాలకు చెందిన మంత్రుల వద్ద ఎమ్మెల్యేలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.












Click it and Unblock the Notifications