తిరుపతిలో రాజధాని.. లేదా తమిళనాడులోకి చిత్తూరు.. టీడీపీ మాజీ మంత్రి డిమాండ్
మూడు రాజధానుల అంశం ఏపీని కుదిపేస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత 15 రోజులుగా దీక్షలు చేస్తోన్న రైతులు.. శుక్రవారం సకలజనుల సమ్మె చేపట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తోన్న మహిళలు, రైతులను పోలీసులు అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. అయితే టీడీపీకే చెందిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిమాత్రం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
పోలీసుల బూట్లు తుడిచి .. వచ్చి వెళ్ళే వాహనాలు శుభ్రం చేసి .. రాజధాని రైతుల వినూత్న నిరసన
మేం ఏపీలో ఉండలేం..
రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత కూడా రాయలసీమ ప్రాంతం అన్యాయానికి గురవుతూనే ఉందని, ఇకపైనా భరించే ఓపిక లేదని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి చెప్పారు. 2014లో అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే.. సెంటర్ పాయింట్ లో ఉందికదాని ఒప్పుకున్నామని, ఇప్పుడు సీఎం జగన్ రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తుండటంతో.. రాయలసీమకు గతంలో కంటే ఎక్కువగా నష్టం జరిగే పరిస్థితులు దాపురించాయని, అందుకే ఏపీ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
తిరుపతి రాజధాని డిమాండ్ పాతదే..
ఏపీ రాజధానిని తిరుపతిలో ఏర్పాటు చేయాలని, లేదంటే చిత్తూరును సగం తమిళనాడులో, సంగం కర్నాటకలో కలిపేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ డిమాండ్ కొత్తదేమీకాదని, విభజన టైమ్ లోనూ ఇక్కడి ప్రజలు ఇదే అభిప్రాయన్ని వెలిబుచ్చారని, ప్రస్తుత ఉద్యమానికి మద్దతిచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ ఉండదని అమర్ నాథ్ రెడ్డి చెప్పారు. డిమాండ్ ను సాధించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
అప్పుడు జగన్ నిద్రపోతున్నాడా?
‘‘పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే మూడు రాజధానులు ఏర్పాటుచేస్తానంటోన్న సీఎం జగన్.. 2014 నుంచి నిద్రపోతున్నాడా? అని అమర్ నాథ్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘జగన్ కు ఒక విధానంగానీ, చిత్తశుద్ధిగానీ లేవు. 2014 లోనే వికేంద్రీకరణ గురించి ఆయనెందుకు మాట్లాడలేదు? అప్పుడు నిద్రపోతున్నాడా? అమరావతి బ్రహ్మాండంగా ఉందని ఆయనే అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడాడు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నారంటే.. ఇప్పుడే నిద్రలేచాడా?''అని నిలదీశారు.
పిచ్చోడి చేతిలో రాయి..
‘‘జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రం పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. వైసీపీ నేతలు ఏం మాట్లాడుతారో, ఏం చేస్తారో ప్రజలకు అర్థంకావట్లేదు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని చూసి నారా భువనేశ్వరి గాజుల్ని విరాళంగా ఇస్తే.. గాజులు కాదు భూములివ్వాలని మంత్రులు వెటకారం చేస్తున్నారు. ఎప్పుడో 2013లో హెరిటేజ్ సంస్థ కొనుక్కున్న భూములపై రాజకీయమేంది? చంద్రబాబుపై బురద చల్లితే ఉద్యమం పక్కదారి పడుతుందనే వైసీపీ మంత్రులు ఇలా వ్యవహరిస్తున్నారు''అని అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు.