పార్టీలో చాలామంది ఉన్నారు: ఆ పదవి లోకేష్ను వద్దన్న బాబు, జాతీయ పార్టీగా..
విజయవాడ: టిడిపిని జాతీయపార్టీల సరసన చేర్చేందుకై ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఒకవైపు రాజధాని నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూ పార్టీని బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు.
శనివారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, పొలిట్ బ్యూరో సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యమైన మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలతో నాలుగు గంటలు పైగా చర్చలు నిర్వహించారు.
కాంగ్రెస్, బిజెపి, మినహా జాతీయ పార్టీలు అనేకం కేవలం రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితమైనప్పుడు ఆంధ్రాలో అధికారంలో ఉండి తెలంగాణాలో బలంగా ఉండి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో తెలుగువారు ఉన్నప్పుడు పార్టీని జాతీయస్థాయిగా మార్చాలన్న ఆకాంక్షను చంద్రబాబు వెలిబుచ్చారు.
తెలుగుదేశం
ఒరిస్సాలో గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చేపట్టిన సహాయ చర్యల వల్ల అక్కడి ప్రజల్లో టిడిపి పట్ల సానుభూతి ఉందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసారు. జాతీయ పార్టీగా మార్చదల్చుకున్నప్పుడు తెలుగుదేశం స్థానంలో ఏ పేరు పెట్టాలనే విషయంపై విస్తృతమైన చర్చ జరిగింది.
తెలుగుదేశం
తెలుగు అనే పదం ఉండటం వలన కన్నడిగులు, తమిళుల నుంచి స్పందన రాకపోవచ్చన్న అంశంపై కూడా చర్చించారు. అలాగే సైకిల్ గుర్తు స్థానంలో ఎన్నికల గుర్తును మరొకదాన్ని ఎంపిక చేసుకోవాలనే అంశంపై కూడా చర్చకు వచ్చింది.
తెలుగుదేశం
జాతీయ కార్యదర్శిగా లోకేష్ పేరును పలువురు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ముఖ్య సమావేశాల్లో అలాంటి వ్యక్తిగత పేర్లను ప్రస్తావించవద్దన్నారు. టిడిపికి గ్రామస్థాయి నుంచి అంకితమై పని చేస్తున్న కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పదేళ్లపాటు జెండా పట్టుకుని తిరిగినవారిని ఎన్నడూ మర్చిపోరాదంటూ చంద్రబాబు హితవు చెప్పారు.
తెలుగుదేశం
కార్యకర్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న భావనను వారిలో కలిగించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయాలన్నారు.
తెలుగుదేశం
దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా ఇప్పటికి రైతాంగ రుణమాఫీకి రూ. 25వేల కోట్లు ఖర్చుపెట్టిన విషయాన్ని, అలాగే పెన్షన్ల పెంపును ప్రస్తావించారు. డ్వాక్రా రుణాల మాఫీతో పాటు ఇతరత్రా వ్యక్తిగత లబ్దికి మొత్తంపై రూ.50వేల కోట్లను ఖర్చు పెట్టామన్నారు.
తెలుగుదేశం
టిడిపి పట్ల అలాగే తన పట్ల అచంచల విశ్వాసం ఉండబట్టే మంగళగిరి ప్రాంతంలో 25వేల ఎకరాల పంట భూములను అప్పగించిన విషయాన్ని చంద్రబాబు తన పలుసార్లు ప్రస్తావించారని సమాచారం. జగన్ కేవలం పదవి కోసం గోతికాడ నక్కలాగా కూర్చుని కుటిల రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలుగుదేశం
కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందంటూ అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
తెలుగుదేశం
ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే జరిపి రేటింగ్ ప్రకటించినప్పటికీ ఇంకా అత్యధిక మందిలో ఆశించినంత మార్పు కనిపించటం లేదని చంద్రబాబు అన్నారు. తక్షణం వారిలో మార్పురాని పక్షంలో పదవులకు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.