జగన్ సతీమణి భారతికి కవిత పిలుపు: 'తెలంగాణ' పాయింట్ లాగిన కొత్తకోట
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత... బతుకమ్మ వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిని ఆహ్వానించడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శుక్రవారం నాడు భగ్గుమన్నారు.
కల్వకుంట్ల కవితపై తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన వైసిపి అధినేత జగన్ కుటుంబాన్ని బతుకమ్మ పండుగకు ఎలా ఆహ్వానిస్తారని పాయింట్ లాగారు.
తెలంగాణ సాధన కోసం అప్పట్లో అన్ని పార్టీలు ఏకమై పోరాడాయని గుర్తు చేశారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై కూడా అలాగే పోరాడుతాయని చెప్పారు. రైతుల పక్షాన నిలవడానికి విపక్షాలన్నీ ఏకమైతే కేసీఆర్కు అంత బాధ ఎందుకో చెప్పాలన్నారు.
కాగా, గురువారం కవిత లోటస్ పాండుకు వెళ్లారు. ఆమె జగన్తో భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఆమె జగన్ సతీమణి భారతితో భేటీ అయ్యారు. బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు. దీని పైన టిడిపి మండిపడింది.
స్వచ్ఛ ఏపీకి పాటుపడాలి: చంద్రబాబు
జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో అందరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు పాటుపడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్ ఏడాది సందర్భంగా చంద్రబాబు శుక్రవారం ఉదయం గుంటూరులో గాంధీ బొమ్మ నుంచి పరేడ్ మైదానానికి కాలి నడకన బయలుదేరారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. నెలలో ఒక్కరోజు స్వచ్ఛ కార్యక్రమానికి కేటాయించాలన్నారు. జిన్నా టవర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చొరవ చూపాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.