టీడీపీ మహిళా ఎమ్మెల్యే అరుదైన ఘనత
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అరుదైన ఘనత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఏపీ లాసెట్ ఫలితాల్లో ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నప్పటికీ, న్యాయవాది కావాలనే తన కలను ఆమె నెరవేర్చుకోవడం విశేషం.
తంగిరాల సౌమ్య రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె తండ్రి తంగిరాల ప్రభాకర్ విజయం సాధించారు. అయితే, ఆయన అకాల మరణంతో తండ్రి స్థానంలో సౌమ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి ఘన విజయం సాధించారు.

ప్రజాసేవలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, లాసెట్లో మంచి ర్యాంకు సాధించడం సౌమ్య నిబద్ధతకు, సంకల్పానికి నిదర్శనం. ఆమె విజయం ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా చదువు పట్ల తమ అంకితభావాన్ని కొనసాగించవచ్చని ఆమె నిరూపించారు.












Click it and Unblock the Notifications