క్షమాపణ, సస్పెండ్కు డిమాండ్: రాక్షసుడన్నారని జగన్
హైదరాబాద్: తమను బఫూన్లంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అధికార పార్టీ మండిపడింది. గౌరవ సభ్యులను అవమానించిన జగన్ను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. బఫూన్లంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలన్నారు.
జగన్ వ్యాఖ్యల పైన సభ పది నిమిషాలు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. సభలో ఇలాంటి ప్రవర్తన ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతిపక్ష నేత ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ క్షమాపణ చెప్పాకే మరో అజెండా చేపట్టాలన్నారు.
జగన్ క్షమాపణ చెప్పాలి లేదా ఆయనను సభ నుండి బయటకు పంపించాలని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఒక ఆర్థిక ఉన్మాది శాసనసభకి వస్తే ఎలా ఉంటుందో జగన్ను చూస్తే అర్థమవుతుందన్నారు. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు. జగన్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని, వైయస్ హయాంలో లక్ష కోట్లు జగన్ తిన్నారని, చంద్రబాబును కూడా వైయస్ అనుచరులు చంపాలని చూశారని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మండిపడ్డారు. 16 నెలలు జైలులో చిప్పకూడు తిన్న తర్వాత కూడా జగన్కు బుద్ధి రాలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ కన్నా పెద్ద బఫూన్ ఎవరూ లేరన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో శాసనసభలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు వినలేదన్నారు. పలువురు నేరస్తులతో జగన్కు సంబంధాలు ఉన్నాయన్నారు.
జగన్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి: కోడెల
జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. తన గురించి అన్న వాళ్లను ఉద్దేశించే ఆ మాట అన్నానని, ఇదే సభలో తనను హంతకుడు అనడం ఏం న్యాయమని జగన్ ఆవేదనగా ప్రశ్నించారు. తనను నరరూప రాక్షసుడు అన్నారని, తమ పార్టీ సభ్యులను స్మగ్లర్లు అన్నారని జగన్ చెప్పారు. కాగా, జగన్ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేయడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు.
గోరంట్లపై జగన్ ఆగ్రహం
గోరంట్ల తన పైన చేసిన వ్యాఖ్యల మీద జగన్ మండిపడ్డారు. చెప్పేది వినలేని మీరు.. చేయని తప్పులకు ఆరోపణలు చేస్తుంటే ఎలా ఊరుకుంటామని జగన్ అన్నారు. తన పైన బురద చల్లటం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. జగన్ను నరరూప రాక్షసుడిని టీడీపీ సభ్యులు ఆరోపించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులే కనీస గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications