గన్నవరంలో వంశీపై పోటీకి టీడీపీలో తీవ్ర పోటీ ? చింతమనేని హాట్ కామెంట్స్..
ఏపీలో ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల పరిస్ధితిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇందులో ఒకరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఈసారి పోటీ చేసే టీడీపీ అభ్యర్ధిపై అన్నిపార్టీల్లో చర్చ నెలకొంది. ఈ చర్చలో ఇప్పుడు పొరుగున ఉన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గన్నవరంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించి మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్న వల్లభనేని వంశీపై పోటీకి టీడీపీలో ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొందని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం టీడీపీ అభ్యర్ధి అయ్యేందుకు పది మంది పోటీ పడుతున్నారని చింతమనేని తెలిపారు. గన్నవరంలో నిన్న మొన్నటివరకూ ఇన్ ఛార్జ్ గా ఉన్న బచ్చుల అర్జునుడు హఠాన్మరణం తర్వాత అక్కడ ఏం జరుగుతుందని కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారని, కానీ టీడీపీలో టికెట్ కోసం తీవ్ర పోటీ ఉందని చింతమనేని తెలిపారు.

గన్నవరానికి చెందిన వైసీపీ నేత దాసరి బాలవర్దనరావు, ఆయన సోదరుడు దాసరి జై రమేష్ త్వరలో టీడీపీలోకి తిరిగి వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే పోటీ పడుతున్న వారితో కలిపి తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉందనేది చింతమనేని వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది. మరోవైపు గన్నవరంలో వైసీపీ అభ్యర్దిగా బరిలోకి ఉంటారని భావిస్తున్న వంశీతో ఇప్పటికే అదే పార్టీకి చెందిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు నుంచి గట్టి పోటీ ఉంది. ఇప్పుడు వీరిలో ఎవరికి టికెట్ రాకపోయినా వారు టీడీపీలోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చింతమనేని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వంపైనా చింతమనేని నిప్పులు చెరిగారు. బాబాయ్ హత్యను అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసిన సీఎం, తల్లికి, చెల్లికి న్యాయంచేయలేని సీఎం.. రాష్టానికేం చేస్తారని చింతమనేని ప్రశ్నించారు. గతంలో గన్నవరం భూముల విలువకూ, ఇప్పటి విలువకూ ఉన్న తేడాను కూడా గమనించాలన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో రాకపోకల్ని కూడా పరిశీలించాలని చింతమనేని సూచించారు.












Click it and Unblock the Notifications