టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్బై: వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తోన్న బీసీ జనార్ధన్ రెడ్డి..
కర్నూలు: తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి గుడ్బై చెప్పబోతున్నారు. త్వరలోనే ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ధీటైన నాయకత్వ లోటును ఎదుర్కొంటోన్న కర్నూలు జిల్లాలో టీడీపీకి ఇది విఘాతమేనని అంటున్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడాన్ని పార్టీ అగ్ర నాయకత్వాన్ని తప్పుపడుతున్నందునే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తోందని బీసీ జనార్ధన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం.
మొన్న కేఈ ప్రభాకర్.. నేడు బీసీ జనార్ధన్..
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతూ వస్తోన్న కేఈ కుటుంబం సైతం దూరమైంది. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ మొన్నటి మొన్నే టీడీపీకి గుడ్బై చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఆయన ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ.. ఆయనకు ఉన్న పరిచయాలు, పలుకుబడి దృష్ట్యా వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం కర్నూలు జిల్లా రాజకీయాల్లో సాగుతోంది. బీసీ జనార్ధన్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం కలకలం రేపుతోంది.

సుదీర్ఘకాలం పాటు టీడీపీలో..
బీసీ జనార్ధన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కర్నూలు లోక్సభ స్థానం నుంచీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కర్నూలు జిల్లాలో బలంగా వీచింది. కర్నూలు జిల్లా నుంచి గెలుపొందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల్లో బీసీ జనార్ధన్ రెడ్డి ఒకరు. 2019లో మరోసారి పోటీ చేసినా, విజయం లభించలేదు. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.












Click it and Unblock the Notifications