తెలంగాణకి మద్దతిచ్చి ఏపీకి వస్తారా?: మందకృష్ణ-కృష్ణయ్యలకు టిడిపి షాక్
విజయవాడ: ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యలకు ఏపీలో పర్యటించే నైతిక హక్కు లేదని టిడిపి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్లు ఆదివారం మండిపడ్డారు.
ఏపీలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అలాగే రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకోవడం ఏమాత్రం సరికాదన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పారు.
కాగా, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మందకృష్ణ మాదిగ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. చంద్రబాబును టిఆర్ఎస్ నేతలు అడ్డుకున్నప్పుడు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చంద్రబాబుకు, టిడిపికి అండగా నిలిచారు. ఇప్పుడు వారికి టిడిపి నేతలు షాకిచ్చారు.
మరోవైపు, ఆర్ కృష్ణయ్య ఏకంగా టిడిపి తరఫున 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనను నాడు చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కన్నా... బీసీ నేతగా ఉండేందుకే ఇష్డపడుతున్నారు. మరోవైపు కాపు ఉద్యమం.. నేపథ్యంలో ఆయనకు టిడిపితో బేధాలు వచ్చాయి.
బీసీలు, కాపుల మధ్య చిచ్చుకు యత్నం: రఘువీరా
బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు మధ్య టిడిపి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. కాపులు బీసీల్లో చేర్చకుండా కొంతమంది బీసీ నేతలను చంద్రబాబే ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఈ నెల 19న వియవాడలో ఏపీ పీసీసీ కార్యాలయం ప్రారంభమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్నారు.