దానికి కర్త-కర్మ-క్రియ చంద్రబాబే..!!
పుట్టపర్తి: మూడు రాజధానులను కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకిస్తూ రెండోదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అమరావతి ప్రాంత రైతులు. ఇందులో భాగంగా వారు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ఇవ్వాళ 23వ రోజుకు చేరుకుంది. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు కొనసాగుతోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలనేది వారి డిమాండ్.

వైసీపీయేతర పార్టీల మద్దతు..
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మహా పాదయాత్రను ఆ ప్రాంత రైతులు చేపట్టారు. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. అమరావతి పరిరక్షణ సమితి దీన్ని నిర్వహిస్తోంది. తెలుగుదేశం, భారతీయ జనత పార్టీ, జనసేన, వామపక్షాలు.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్నాయి. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంట్రీ..
ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, పార్వతిపురం మన్యం మీదుగా శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించింది.

మాజీమంత్రి ఘాటు వ్యాఖ్యలు..
ఈ పరిస్థితుల మధ్య రైతుల పాదయాత్రపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ఘాటు విమర్శలు చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని, ఆయనే వెనుక ఉండి ఈ పాదయాత్రను నడిపిస్తోన్నాడని ఆరోపించారు. ఈ యాత్రకు కర్త-కర్మ-క్రియ ఆయనేనని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అడ్డంకిగా మారాడని ధ్వజమెత్తారు.

రాజకీయ పబ్బం కోసం..
ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ అజెండాగా పెట్టుకుందని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా ఏదయినా జరగరానిది జరిగితే, ఆ నెపాన్ని ప్రభుత్వం మీద మోపి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తోందని అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, దాన్ని చూసి గిట్టని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని మండిపడ్డారు.

అలజడుల కోసం..
రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో చంద్రబాబు బూటకపు పాదయాత్ర చేయిస్తున్నారని శంకర నారాయణ మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు సూచించిన మేరకు అధికారాన్ని వికేంద్రీకరించితే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులన్నీ హైదరాబాద్లోనే కేంద్రీకరించడం వల్ల, విభజన తరువాత ఏపీ నష్టపోయిందని శంకర నారాయణ గుర్తు చేశారు. రైతుల పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న శవయాత్ర అని మాజీ మంత్రి శంకర్ నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications