ఎమ్మెల్యే 20 కోట్లు.. టీడీపీ మార్కెట్: వైసిపి ఎమ్మెల్యే
రాజకీయాలు ఓ మార్కెట్ గా మారిపోయి.. నేతలంతా అందులో ముడిసరుకులుగా మారిపోయిన తర్వాత రాజకీయ కొనుగోళ్లు యథేచ్చగా జరిగిపోతున్న పరిస్థితి. ప్రస్తుత ఏపీ రాజకీయాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అబివృద్ధి చూసి పార్టీలు మారుతున్నారని టీడీపీ సమర్థించుకునే ప్రయత్నం చేసినా నిజానిజాలేంటనేది అందరికి తెలిసిన విషయమే.
తాజాగా ఇదే విషయాలను ప్రస్తావిస్తూ.. టీడీపీ ప్రలోభాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు. తాను టీడీపీలో చేరడానికి అంగీకరిస్తే రూ.20 కోట్టతో పాటు అమరావతిలో ఎకరా భూమిని ఇస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్, నారా లోకేష్ తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఇవిగాక ప్రభుత్వ కాంట్రాక్గులను కట్టబెట్టడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు సదరు నేతలు తనతో తెలిపారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు.
జగన్ తో ఢిల్లీ వెళ్ళేముందు కూడా టీడీపీ నేతలు తనకు పెద్ద ఎత్తున డబ్బు ముట్టజెప్పుతామని ప్రలోభ పెట్టారని, అవినీతి రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణకి 150 ఎకరాలు ఇస్తామని ఆశ చూపడంతోనే ఆయన టీడీపీలో చేరారని ఆరోపించారు. జనంలో ఎవరి సత్తా ఎంతుందో తెలియాలంటే.. టీడీపీలో చేరిన కిడారితో కలిసి అరకులో బహిరంగ సభ పెట్టాలని, అదే రోజు జగన్ తో వైసీపీ కూడా అరకులో సభ పెడుతుందని, గిరిజనులు ఎవరి వెంట నడుస్తారో ఈ దెబ్బతో తేలిపోతుందన్నారు.