వైఎస్ దెబ్బకు ఇప్పటికీ తిరుగుతున్నా- దేవినేని ఉమ షాకింగ్..!
ఏపీలో వైఎస్ కుటుంబం పేరు చెబితే చాలు మండిపడే టీడీపీ నేతల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు. వైఎస్ అన్నా, ఆయన కుమారుడు జగన్ అన్నా దేవినేని ఉమకు ఉన్నంత కోపం మరెవరికీ లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే దేవినేని ఉమ విషయంలోనూ వారి కోపం అదే స్దాయిలో ఉండేదన్న విషయాన్ని ఆయన ఇవాళ బయటపెట్టారు.
వైఎస్ జగన్ తో మొదలుపెట్టి ఆయన తండ్రి వరకూ వైఎస్ వరకూ ఇవాళ దేవినేని ఉమ వరుస విమర్శలకు దిగారు. బెయిల్ పై ఉన్న ముద్దాయి జగన్ చట్టాల్ని కాపాడే వ్యవస్థల్ని బెదిరించేలా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉమ విమర్శించారు. జగన్ ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని చంద్రబాబు చేసి చూపిస్తున్నారని, చేతనైతే ఆయన తన పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని దేవినేని ఉమ సవాల్ విసిరారు.

మరోవైపు వైఎస్ జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. వైఎస్ హయాంలో పెట్టిన కేసులకు తాను ఇవాళ్టికీ వాయిదాలకు కోర్టులకు తిరుగుతున్నట్లు ఉమ గుర్తుచేసుకున్నారు. కాబట్టి జగన్ కేసుల విషయంలోనూ అదే తరహాలో పోలీసులు, న్యాయవ్యవస్థ సీరియస్ గా తీసుకుని త్వరగా విచారణ చేయాలని దేవినేని కోరారు. మరోవైపు జగన్ అసెంబ్లీకి రాలేని పిరికి వ్యక్తి అని, అలాంటి వారు ప్రతిపక్షానికి సైతం పనికి రారంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యమన్నా, కోర్టులన్నా జగన్ కు లెక్కలేదన్నారు.

జగన్ ను తిరిగి సీఎంను చేసేందుకు ఏపీలో కుట్రలు జరుగుతున్నాయని దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. సింగయ్య ఘటనే ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా వారి బుద్ధి మారడం లేదంటూ ఉమ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడితే ప్రజలే తన్ని తరిమేస్తారన్నారు.












Click it and Unblock the Notifications