విశాఖలో జగన్ ఎంత భూమి కొన్నాడో తెలుసా? రాసే దమ్ముందా?
రెండు వారాలుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు రోడ్లమీదికొచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాన్ని జగన్ వమ్ము చేశాడని విమర్శించారు. 29 గ్రామాల రైతులు చెబుతున్న మాటలు.. 13 జిల్లాల్లోని 5కోట్ల మంది ప్రజల్ని కదిలించాయని.. ప్రజా ఉద్యమం ద్వారానే జగన్ మెడలువంచి.. అమరావతిలోనే రాజధానిని నిలుపుకొంటామని చెప్పారు. రైతులకు సంఘీభావంగా గొల్లపూడిలో ఆయన 24 గంటల దీక్ష చేపట్టారు.

తిక్క నిర్ణయాలు.. చెత్త కమిటీలు..
రాజధాని విషయంలో జగన్ సర్కారు తొలి నుంచీ డ్రామాలాడుతోందని ఉమ గుర్తుచేశారు. ‘‘మొదట కేబినెట్ సబ్ కమిటీ అన్నారు. తర్వాత పీటర్ కమిటీ వేశారు. అటుపై రెండు సార్లు సస్పెండైన కన్ఫర్డ్ ఐఏఎస్ జీఎన్ రావుతో కమిటీ వేశారు. అదీ అయిపోయాక బోస్టన్ కన్సల్టెన్సీ అన్నారు. దాని రిపోర్టు రాకముందే.. హైపవర్ కమిటీ వేశారు. ఇంత తెలివితక్కువ పనులు.. తిక్క నిర్ణయాలు.. చెత్త కమిటీలు వేసుకుంటూ పోతున్నారు. పిచ్చి కూతలు కూసే మంత్రులతో హై పవర్ కమిటీ అట. అసలు వాళ్లకు పవరే లేదు''అని ఫైరయ్యారు.

ఎమ్మెల్యేలంతా జగన్ కు జీ హుజూర్ అన్నారు..
నిజానికి మూడు రాజధానులపై సీఎం జగన్ శాసనసభలో ముందే చెప్పేశారని, ఆ తర్వాత రిపోర్టులు, కమిటీలు అనడంలో ఏమైనా ఉపయోగం ఉందా? అని దేవినేతి ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా జగన్ కు జీ హుజూర్ అంటూ సాగిలపడ్డారని, ఇక ప్రజాఉద్యమాలు, కోర్టులే రాజధానిని కాపాడుతాయని చెప్పారు. రెండు జిల్లాల పట్ల జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాఉద్యమాలు వస్తాయని తెలిసే టీడీపీ ఎమ్మెల్యేల్ని ప్రలోభాలకు గురిచేసి జగన్ తనవైపుకు తిప్పుకుంటున్నాడని మండిపడ్డారు. ఇలాంటి క్రైసిస్ చంద్రబాబుకు కొత్త కాదని, జగన్ లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా టీడీపీని ఏమీ చెయ్యలేరని ఉమ అన్నారు.

విశాఖలో జగన్ గ్యాంగ్ కు భూములు
రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే విషయమై ఆరు నెలల కిందటే బ్లూప్రింట్ సిద్ధం చేశారని, ఆ మేరకు జగన్ గ్యాంగ్ విశాఖలో వేల ఎకరాల భూములు కొనేసిందని దేవినేని ఉమ ఆరోపించారు. ‘‘వైజాగ్ వెళ్లి ఎవరినైనా అడగండి.. గత ఆరు నెలల్లో వైఎస్సార్సీపీకి చెందిన ఎవరెవరు ఎన్నెన్ని భూములు కొన్నారో రికార్డులు తీస్తే బండారం బట్టబయలవుతుంది. దాదాపు 6 వేల ఎకరాల్ని జగన్ గ్యాంగ్ కొనిపెట్టుకుంది. ఈ విషయాల్ని పరిశోధించి రాసే దమ్ము ఎవరికైనా ఉందా?''అని సవాలు విసిరారు.












Click it and Unblock the Notifications